శ్మశానంలో సరస్వతి పుత్రుడు.. గిరిపుత్రులకు శాపమైన నెట్‌వర్క్

by  |
శ్మశానంలో సరస్వతి పుత్రుడు.. గిరిపుత్రులకు శాపమైన నెట్‌వర్క్
X

దిశ, కొత్తగూడ : ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతోంది. కరోనా రక్కసి వలన విద్యార్థులందరూ ఆన్‌లైన్ క్లాసుల పేరిట మొబైల్‌లకు అతుక్కుపోతున్నారు. స్కూల్ పిల్లాడి నుంచి కాలేజీ విద్యార్థి వరకు ఆన్‌లైన్‌లోనే విద్యా బోధన. అయితే, సోషల్ మీడియా అనేది విద్యార్థులపై దుష్ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. సెల్‌ఫోన్‌ను చదువు కోసం కాకుండా ఇతర యాక్టివిటీస్ కోసం అధికంగా వినియోగించడం వలన విద్యార్థుల చదువు అటకెక్కిన ఘటనలు అనేకం. ఇదంతా ఒకవైపు అయితే, తల్లిదండ్రుల కష్టాన్ని గమనించిన ఓ గిరిపుత్రుడు స్మశానంలోనూ తన విద్యను కొనసాగిస్తున్నాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఈ బాలుడి కష్టం విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలుస్తోంది.

సవాళ్లను ఎదిరిస్తూనే..

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన చుంచ వెంకటయ్య, సమ్మక్కల కొడుకు రోహిత్ గ్రామంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత నర్సంపేటలో ఇంటర్ చదివాడు. ఏజెన్సీ ఏరియాకు చెందిన రోహిత్ కష్టపడి ఎంసెట్ పోటీ పరీక్షను ఎదుర్కొని మధ్యప్రదేశ్‌లోని ఓరియంటల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో సీటు సంపాదించాడు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చదువు సజావుగా సాగుతున్న తరుణంలో కరోనా కారణంగా కళాశాలకు సెలవులు ఇవ్వడంతో తిరిగి మడగూడెంకు చేరుకున్నాడు. ఆన్‌లైన్ క్లాసులు మొదలవడంతో ఆందోళన చెందిన రోహిత్ సెల్‌ఫోన్ సిగ్నల్ కోసం వెతకని ప్రాంతం లేదు. చివరికు మడగూడెం స్మశాన వాటికలో సిగ్నల్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఆన్‌లైన్ క్లాసులు వినడం మొదలెట్టాడు. మొదట్లో భయం భయంగా వెళ్లినా చదువు మీదున్న ఆసక్తితో ఒక్కడే పొద్దున వెళ్లి సాయంత్రం వరకు అక్కడే క్లాసులు వింటున్నాడు. వర్షానికి సైతం లెక్కచేయకుండా స్మశానంలో నిర్మించిన గదుల్లోనే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు.

సిగ్నల్ ప్రాబ్లమ్..

గంగారం మండలంలో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ తప్పా మరొకటి పనిచేయదు. అది కూడా అన్ని గ్రామాల్లో అరకొర మాత్రమే. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న గిరిపుత్రులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గంగారం మండలంలో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ పెంచితే మరికొంత మంది విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో చదువుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల కష్టాలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Next Story