కేఆర్ఎంబీలో బలంగా గొంతెత్తాలి : సీఎం కేసీఆర్

by  |
కేఆర్ఎంబీలో బలంగా గొంతెత్తాలి : సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం రాజీ పడే ప్రసక్తే లేదని, బలంగా కొట్లాడాలని, సెప్టెంబరు 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశంలో సైతం గట్టిగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు సెప్టెంబరు 1వ తేదీన రెండు రాష్ట్రాలతో నిర్వహించే ఫుల్ బోర్డు మీటింగుకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించారు. న్యాయమైన నీటి వాటా కోసం ఆ సమావేశంలో బలంగా వాదనలను వినిపించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇంతకాలం ఏపీ 64%, తెలంగాణ 36% నిష్పత్తిలో నీటిని వాడుకుంటున్నా ఈ సంవత్సరం నుంచి మాత్రం 50:50 నిష్పత్తిలో వాడుకుంటామని ఇప్పటికే కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాసింది.

కేఆర్ఎంబీ ఫుల్ బోర్డు మీటింగ్‌లో తెలంగాణ వినిపించాల్సిన బలమైన వాదనలు, అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం ఈ సమావేశంలో మాత్రమే కాకుంటా కోర్టులు, ట్రిబ్యునళ్లు, అపెక్స్ కౌన్సిల్ లాంటి అన్ని వేదికలమీదా బలమైన వాదనలనే వినిపించనున్నట్లు నొక్కిచెప్పారు. లేవనెత్తిన వాదనకు తగినట్లుగా సాధికారికమైన సమాచారాన్ని, గతంలో జారీ చేసిన జీవోలు, బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు తదితరాలన్నింటినీ సమావేశానికి తీసుకుని వెళ్లాలని, చట్టబద్ధమైన హక్కుగా లభించిన ఆధారాలన్నింటినీ సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో చర్చకు రానున్న ఎజెండా అంశాలపై కేసీఆర్ విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో సీనియర్ న్యాయవాది రవీందర్ రావు, ఇంటర్ స్టేట్ విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed