ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు తక్షణ రుణం

by  |
ఈ స్కీమ్ కింద వీధి వ్యాపారులకు తక్షణ రుణం
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. రోజుకూలీ మొదలుకుని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వరకు, వీధి వ్యాపారి మొదలుకుని షాపింగ్ మాల్ యజమాని వరకు అందరూ బాధితులుగా మిగిలిపోయారు. ముఖ్యంగా వీధి, చిరు వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నారు. కనీసం తిరిగి వ్యాపారాలు మొదలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ యోజనలో భాగంగా ‘ప్రధాన మంత్రి స్వనిధి స్కీమ్’ను తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా వీధి, చిరు వ్యాపారులకు గ్యారంటీ లేకుండా రూ.10,000 వరకు రుణం పొందడానికి అవకాశం ఉంది.

అన్ని గ్రామీణ, పట్టణ, సహకార, వాణిజ్య, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు గ్యారంటీ లేకుండా రుణం మంజూరు చేస్తాయి. కానీ, దేశంలో లాక్‌డౌన్‌‌కు ముందు (మార్చి 24, 2020) వీధి వ్యాపారం చేస్తూ ఉండాలి. రుణం పొందాలనుకునే వారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం, వ్యాపారం చేస్తున్న దగ్గర ఫొటో, వ్యాపారి పాస్‌ఫోర్ట్ ఫొటో‌తో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తును గ్రామాల్లో ఐకేపీ కో-ఆర్డినేటర్, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంఎస్ఎంఈ కో-ఆర్డినేటర్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చంటే..

పండ్లు, కూరగాయలు, పూలు, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, చేతి వృత్తులు, మెకానిక్, టైలర్, పెయింటర్, హెయిర్ సెలూన్, చెప్పులు కుట్టేవారు, కుండలు, పండ్ల రసాల విక్రయదారులు, ఫాస్ట్‌ఫుడ్, రెడీమేడ్ గార్మెంట్స్, పుస్తకాలు, న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ వస్తువుల విక్రయదారులు, ఇంటి సామగ్రి, గాజులు, పూసలు, బ్యాగ్స్, వాచెస్, బెల్ట్, స్టేషనరీ వస్తువులు, పాన్ షాప్, బేకరీ, పూజా వస్తువులు, సర్వీస్ ప్రొవైడర్స్ తదితర వీధి, చిరు వ్యాపారులు రుణం పొందడానికి అర్హులు.

రుణం చెల్లిస్తే వడ్డీ రాయితీ

వ్యాపారం తిరిగి ప్రారంభించడం కోసం రూ.10,000 వరకు రుణం ఇస్తారు. ఈ రుణానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది. క్రమ పద్ధతిలో వాయిదాలను చెల్లించిన వారికి 7శాతం వడ్డీ రాయితీని నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదటి ఏడాది క్రమం తప్పకుండా రుణం చెల్లించిన వారికి మరుసటి ఏడాది రెట్టింపు రుణం అంటే రూ.20,000 రుణం ఇస్తారు.



Next Story

Most Viewed