ఇంట్లో ఒంటరి మహిళ.. అపరిచితుడి అరాచకం

by  |
ఇంట్లో ఒంటరి మహిళ.. అపరిచితుడి అరాచకం
X

దిశ, వెబ్‌డెస్క్: అపరిచిత వ్యక్తులతో జాగ్రత్త ఉండాలని పోలీసులు చెబుతున్న హెచ్చరికలు ఈ ఘటన నిదర్శనం అవుతాయేమో. అగంతకులు అమయాకంగా వచ్చి అనర్థాలకు పాల్పడున్నారని అక్కడ.. ఇక్కడ వినడమే తప్ప ఎక్కడా చూసింది లేదు. ఇటువంటి భయంకర ఘటన హైదరాబాద్‌ వనస్థలిపురంలో కలకలం రేపింది. ఇంట్లో ఉంటున్న ఒంటరి మహిళలను మరింతగా భయపెట్టింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే..

వనస్థలిపురంలో ఉమాదేవి అనే మహిళ తన భర్తతో కలిసి ఉంటుంది. భర్త ఉదయమే ఉద్యోగానికి వెళ్తాడు. ఈ సమయంలో ఉమాదేవికి తోడు ఆమె అత్తమ్మ కూడా ఉండేది. కానీ, శనివారం రోజు భర్త ఉద్యోగానికి వెళ్లగా.. అత్తమ్మ పని నిమిత్తం బయటకువెళ్లింది. అయితే, ఉమాదేవి కదలికలపై ఓ దుండగుడు ఎప్పుడు నిఘా వేశాడో గానీ సమయం కోసం ఎదురుచూడసాగాడు. ఈ రోజు ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఉదయం ఇళ్లు అద్దెకు కావాలని వచ్చాడు. మరోసారి రెక్కీ నిర్వహించి మధ్యాహ్నం వేళ వచ్చాడు.

రూమ్ అద్దెకు కావాలి అంటూ.. ఉమాదేవితో మాటలు కలిపి గూగుల్‌ పే చేస్తాను అని కోరాడు. దానికి నిరాకరించిన ఉమాదేవి తన అత్తమ్మ, భర్త వచ్చిన తర్వాత మాట్లాడాలి అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో బయటకు వెళ్లినట్టే వెళ్లి.. మళ్లీ వెనక్కి వచ్చిన యువకుడు ఆమెపై దాడి చేశాడు. ఇదే సమయంలో ఓ కత్తి తీసి చేతిపై గాయం చేశాడు. మోహంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఉమాదేవి గాయాలతో విలవిలలాడుతున్న సమయంలో మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. వెంటనే బయటకు పరుగులు తీసిన ఉమాదేవి ఇరుగుపొరుగు వారిని పిలిచే లోపే నిందితుడు పరారీ అయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కదలికలపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న గృహిణిలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలపై ఆకస్మాతుగా వచ్చిన దుండగులు దాడి చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. స్నాచింగ్‌కు వచ్చిన యువకుడు మహిళను హత్య చేస్తే పరిస్థితి ఏంటని భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Next Story