స్టేషన్ ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ పాలకమండలి కీలక నిర్ణయం

by  |
స్టేషన్ ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ పాలకమండలి కీలక నిర్ణయం
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: రైతులకు సేవచేసే భాగ్యాన్ని సద్వినియోగం చేసుకుంటామని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‎పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి మొదటి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఏడేళ్లుగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రైతును రాజుగా చేసేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రైతు పండించిన ప్రతి గింజను మార్కెట్లో కొనుగోలు చేసి రైతుకు మేలు చేసేందుకు నూతన పాలకవర్గం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులకు అందించేందుకు వ్యాపారస్తులకు, రైతులకు మధ్య అనుసంధానకర్తగా ఉండి రైతాంగానికి సేవ చేసేందుకు ఏడాది పాటు కృషి చేస్తామన్నారు.

అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. గత ఏడాది రూ. 2 కోట్ల 70 లక్షల వ్యాపార లావాదేవీలు నిర్వహించిన స్టేషన్ ఘన్ పూర్ వ్యవసాయ మార్కెట్ ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు వసతులు కల్పించి, రైతులకు వ్యాపారస్తులకు మధ్య వారధిగా ఉండి, గిట్టుబాటు ధర అందించేందుకు పాలకమండలి కృషి చేయాలన్నారు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో అంగడి ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ చందర్, కార్యదర్శి జీవన్ కుమార్, డైరెక్టర్లు రాజన్ బాబు, హరీష్, శ్యాంసుందర్, రాజ్ కుమార్, వరుణ్, సరిత, సోమేశ్వర్, సుప్రియ, ఎంపీడీఓ కుమార స్వామి పాల్గొన్నారు.



Next Story

Most Viewed