యాదాద్రిలో మరో అద్భుతం.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో స్టార్ హోటల్

by  |
Yadadri hotel
X

దిశ, యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రముఖ దేవస్థానం తిరుమల తిరుపతికి ఏమాత్రం తీసిపోకుండా అద్భుతంగా నిర్మిస్తున్నారు. అద్భుత శిల్పసౌందర్యంతో చారిత్రక సౌందర్యం ఉట్టిపడేలా, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పనులు, తుదిదశకు చేరుకున్నాయి. ప్రధాన ఆలయం నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. మిగతా చివరి పనులు వేగంగా సాగుతున్నాయి. రాబోయే రెండు, మూడు నెలల్లో ఆలయాన్ని పునఃప్రారంభించుకునేలా పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​అధికారులను ఆదేశించారు.

కాగా, ఆలయ ప్రారంభం అనంతరం ప్రపంచ దేశాల నుంచి భక్తులు రానున్న నేపథ్యంలో యాదాద్రిలో మరో అద్భుతం చోటు చేసుకోబోతున్నది. సకల వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో లగ్జరీ హోటల్‌ కొలువుదీరబోతున్నది. ఆలయానికి కేవలం 2.4 కిలో మీటర్ల దూరంలోనే లక్ష్మీ నివాసం డెలవపర్స్, అపీజే సురేంద్ర పార్క్‌ హోటల్స్‌ సంయుక్తంగా ఈ హోటల్‌ను నిర్మించాయి. సుమారు రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ హోటల్ వచ్చే ఏడాది మార్చి 20న వైభవంగా ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని ది పార్క్‌ హోటల్‌లో లక్ష్మీ నివాసం చైర్మన్‌ రాజేంద్ర ప్రసాద్‌, నేషనల్‌ హెడ్‌ ది పార్క్‌ జనరల్‌ మేనేజర్‌ వికాస్‌ అహ్లూవాలియ హోటల్‌ విశేషాలను వెల్లడించారు.

Next Story

Most Viewed