శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

by  |
శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆలయంలో గురువారం రాత్రి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సంద‌ర్భంగా సేనాధిప‌తి శ్రీ విష్వక్సేనులవారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తారు. సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా అంకురార్పణ ఘ‌ట్టం నిర్వహించారు.

విశిష్టత..

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. న‌వ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. ప్రధాన ఉత్సవానికి 7, 5, 3 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యుడు అస్తమించిన తరువాతే అంకురార్పణ నిర్వహిస్తారు.

అంకురార్పణంలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటడం తెలిసిందే. అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా జరుగుతాయి. విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అంకురార్పణ జరిగే రోజు మధ్యాహ్నం వేళ విత్తనాలను కొత్త పాత్రలో నీటిలో నానబెడతారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు.

ఆ తరువాత మంట ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది. కార్యక్రమంలో టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి, జెఈవో బ‌సంత్ ‌కుమార్‌, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, వేణుగోపాల దీక్షితులు, రామ‌కృష్ణ దీక్షితులు, హ‌రీంద్రనాథ్‌, విజిఓ మ‌నోహ‌ర్‌, పేష్కార్ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed