తెరుచుకున్న శ్రీశైలం 4 గేట్లు.. పోటెత్తనున్న పర్యాటకులు

by  |
తెరుచుకున్న శ్రీశైలం 4  గేట్లు.. పోటెత్తనున్న పర్యాటకులు
X

దిశ, అచ్చంపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రంలోను విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి డ్యామ్ నుండి వరద జలాలు వచ్చి జూరాల ప్రాజెక్టులో చేరుతున్నాయి. జూరాల ప్రాజెక్టు నుంచి ఆదివారం అర్థరాత్రి నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ వడివడిగా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షా ఎనభై రెండువేల 876 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఆదివారం అర్ధరాత్రి రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. అలాగే సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వరద ఉధృతి మరింత ఎక్కువ కావడంతో మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి ఒక లక్షా 11 వేల 932 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా 215 పాయింట్ 807 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 884. 80 అడుగులు చేరగా 214. 8450 టీఎంసీల సామర్థ్యం ఉన్నది.

పెరగనున్న పర్యాటకుల రద్దీ..

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఈ ఏడాది నాలుగోసారి ఎత్తడంతో ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు పర్యాటకులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చే అవకాశం ఉన్నది. ప్రాజెక్టు వద్ద రద్దీ పెరగనుంది. దసరా పండుగ సందర్భంగా స్వరాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు తదితర ప్రాంతాల నుండి శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాలను శ్రీశైలం ప్రాజెక్టు పాతాళ గంగ వద్ద నిమజ్జనం చేసేందుకు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. మరోసారి శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మరింత రద్దీగా ఉండే అవకాశం ఉంది.

వాహనదారులు జాగ్రత్త..

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో యాత్రికులు, సందర్శకులు పెద్ద మొత్తంలో వెళ్తుంటారు. నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం జాతీయ రహదారి మలుపులతో ఉంటుంది. కావున కొత్తగా వచ్చే వాహనదారులు జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉంటుంది. కావున వాహనాలు నడిపే డ్రైవర్లు అప్రమత్తతో అధిక స్పీడ్ తో వాహనాలను నడపకుండా సురక్షితమైన ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Next Story

Most Viewed