వైఎస్ఆర్‌ను తిడుతున్నా జగన్ పట్టించుకోరా.?

by  |
Srinivasulu reddy
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదం జఠిలమవుతుంటే మంత్రులు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోని తీరుతామని తెలంగాణ మంత్రులు సవాళ్లు చేస్తుంటే నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తన తండ్రిని దూషిస్తున్నా సీఎం జగన్ పల్లెత్తుమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై పనిగట్టుకుని విమర్శలు చేస్తున్న మంత్రులు జల వివాదంపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టులపై దారుణంగా వ్యవహరిస్తుంటే మంత్రులు మాట్లాడకపోవడం లోపాయపారి ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతుందన్నారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా అన్ని రకాల అనుమతులతో పనులు చేపట్టి పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని డ్రామాలను కట్టిపెట్టాలని విమర్శించారు. ఉత్తుత్తి జీవోలు ఇవ్వకుండా సీమకు సాగు జలాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గుట్కా మాఫియాపై ఆరోపణలు చేస్తే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. గుట్కా మాఫీయాపై డీజీపీకి లేఖ రాస్తే తనపై విచారణ జరుపుకోవచ్చు.. కాల్ డేటా పరిశీలించుకోవచ్చంటూ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed