భారత్‌లో త్వరలో మూడో టీకాకూ ఆమోదం

by  |
భారత్‌లో త్వరలో మూడో టీకాకూ ఆమోదం
X

న్యూఢిల్లీ: మనదేశంలో ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాలను పంపిణీ చేస్తున్నారు. ఈ రెండింటికీ భారత రెగ్యులేటరీ ఆమోదం తెలిపింది. ఈ రెండు టీకాలతోపాటు మూడో టీకాకూ త్వరలోనే ఆమోదం లభించనుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వెల్లడించింది. ఆ మూడో టీకా రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ కావడం గమనార్హం. ‘స్పుత్నిక్ వీ టీకాను మరికొన్ని వారాల్లో భారత రెగ్యులేటరీ ఆమోదిస్తుందని అంచనా వేస్తున్నాం. ఇది రెండు డోసుల టీకా. రెండు డోసుల మధ్య 21 రోజుల తేడా ఉంటుంది. మొత్తం 28 నుంచి 42 రోజుల్లో కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.

ఈ టీకా మరికొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (ఏపీఐ, సర్వీసెస్) సీఈవో దీపక్ సప్రా తెలిపారు. రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రష్యా, ఇండియా, యూఏఈ సహా పలుదేశాల్లో ఈ టీకాపై ట్రయల్స్ నిర్వహించారు. టీకాకు 91.6శాతం సమర్థత ఉన్నట్టు ప్రముఖ పరిశోధనాత్మక మ్యాగజైన్‌లలోనూ ప్రచురితమైంది. ‘దీనికి అదనంగా తాము స్వయంగా మనదేశంలో ట్రయల్స్ నిర్వహించాం. భారత ప్రజలపై ఈ టీకా సామర్థ్యం, సేఫ్టీ లెవెల్స్‌ను పరిశీలించాం. ఈ వివరాలన్ని ప్రస్తుతం రెగ్యులేటర్‌కు సమర్పించాం. త్వరలోనే స్పుత్నిక్-వీ టీకాకు ఆమోదం లభిస్తుందని అనుకుంటున్నాం’ అని సప్రా వివరించారు.

Next Story

Most Viewed