ముందు భయపడకుండా ఆడండి.. అప్పుడే కప్ దక్కుతుంది : టీమ్ ఇండియాకు యువరాజ్ సింగ్ కీలక సూచన

by Dishanational3 |
ముందు భయపడకుండా ఆడండి.. అప్పుడే కప్ దక్కుతుంది : టీమ్ ఇండియాకు యువరాజ్ సింగ్ కీలక సూచన
X

దిశ, స్పోర్ట్స్ : 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమ్ ఇండియా మరో ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఇటీవల సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్‌లో కప్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగించిన టీమ్ ఇండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాలో చేతిలో ఓడిపోవడంతో ఆశలు చెల్లాచెదరయ్యాయి. అయితే, ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించేందుకు టీమ్ ఇండియాకు మరో అవకాశం దగ్గర్లోనే ఉంది. మరో ఐదు నెలల్లో టీ20 వరల్డ్ కప్ సమరం మొదలుకానుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌‌కు ముందు టీమ్ ఇండియాకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక సూచన చేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే ముందు భయపడకుండా ఆడాలని వ్యాఖ్యానించాడు. ‘టీ20ల్లో భయపడకుండా ఆడటం చాలా ముఖ్యం. మేము తొలి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మా జట్టు నిర్భయంగా ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవం, మంచి కెప్టెన్ ఉండాలి.’ అని తెలిపాడు. అలాగే, టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను ఎవరు నడిపించాలనుకుంటున్నారనే ప్రశ్నకు యువీ స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదన్నాడు.‘హార్దిక్ అందుబాటులో ఉన్నా, లేకున్నా.. రోహిత్ సారథ్యం వహించినా, కెప్టెన్‌గా ఉండకపోయినా అది నా నిర్ణయం కాదు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్. అందులో సందేహం లేదు.కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది సెలెక్టర్లు.’ అని యువరాజ్ చెప్పుకొచ్చాడు.

Next Story