కుర్రాళ్లు బాబోయ్ !.. మూడో టెస్టులో అదరగొడుతున్న యువ ఆటగాళ్లు

by Dishanational5 |
కుర్రాళ్లు బాబోయ్ !.. మూడో టెస్టులో అదరగొడుతున్న యువ ఆటగాళ్లు
X

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మన కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఇటు బ్యాటింగ్‌లోనూ అటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తూ ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తున్నారు. వాళ్ల ‘బజ్‌బాల్’ ఆటతీరుకు అడ్డుకట్ట వేస్తున్నారు. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) సెంచరీలతో చెలరేగగా, ఇదే టెస్టులో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్(46) సైతం కీలక ఇన్నింగ్స్ ఆడారు. జట్టు 445 పరుగుల భారీ స్కోరు సాధించడంలో ఈ యువ బ్యాటర్లు తమదైన పాత్ర పోషించారు. ఇక, రెండో రోజు తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్.. 207/2తో గట్టి పునాదులు వేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మూడోరోజైన శనివారం ప్రత్యర్థి బ్యాటర్లు మరింత చెలరేగుతారేమోనని అంతా అనుకున్నారు. కానీ, మన బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో వారి దూకుడుకు కళ్లెం వేశారు. ముఖ్యంగా యువ బౌలర్ సిరాజ్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమ్ ఇండియా.. భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ సెంచరీ(104)తో చెలరేగగా, మరో యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ సైతం అర్ధసెంచరీ(65)తో క్రీజులో పాతుకుపోయాడు.

శతక్కొట్టిన జైశ్వాల్.. పట్టుబిగించిన భారత్ !

ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసి, రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడోరోజు ఆటపై పట్టు బిగించింది. శనివారం నాటి ఆట ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు మాత్రమే చేసి రూట్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దీంతో 30 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమన్ గిల్‌తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరూ కలిసి 160 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే యశస్వి జైశ్వాల్ 122 బంతుల్లో 5 సిక్సులు, 9 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో జైశ్వాల్‌కు ఇది రెండో శతకం కావడం విశేషం. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా డబుల్ సెంచరీ (209) చేసిన విషయం తెలిసిందే. అయితే, సెంచరీ చేసిన కాసేపటికే 104 పరుగుల వద్ద వెన్నునొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతకన్నా ముందే శుభమన్ గిల్ 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. జైశ్వాల్ క్రీజును వీడిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రజత్ పాటిదార్ ఖాతా తెరవకుండానే టామ్ హార్లీ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్(3 బ్యాటింగ్) నైట్ వాచ్‌మెన్‌గా వచ్చాడు. క్రీజులో కుల్దీప్‌తోపాటు గిల్(65బ్యాటింగ్) ఉన్నాడు. మొత్తంగా మూడో రోజు ఆట ముగిసేసరికి 196/2తో టీమ్ ఇండియా పటిష్ట స్థితిలో ఉంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యం(126)తో కలిపి 322 పరుగుల లీడ్‌లోకి వెళ్లింది. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి కాబట్టి, ఈ ఆధిక్యం మరింత పెరగనుంది. అయితే, ఆదివారం రెండు సెషన్లపాటు వేగంగా ఆడి వీలైనన్నీ పరుగులు రాబట్టుకుని, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టి, రోహిత్ సేన వికెట్ల వేటకు సిద్ధమయ్యే వీలుంది.

మియా మాయ

రెండో రోజు ఆట ముగిసేసరికి 207/2తో పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్.. మూడో రోజు మాత్రం భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. మన హైదరబాదీ మియా భాయ్ సిరాజ్ 4(ఒక వికెట్ శనివారం పడింది) వికెట్లతో రెచ్చిపోగా, జడేజా, కుల్దీప్ యాదవ్ రెండేసి, బుమ్రా ఒక్కో వికెట్‌తో ఇంగ్లాండ్‌ను కూల్చేశారు. దీంతో ఇంగ్లాండ్ ఓవర్ నైట్ స్కోరుకు మరో 112 పరుగులు మాత్రమే చేసింది. సెంచరీ వీరుడు డకెట్ (153).. తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 20 పరుగులు జోడించి కుల్దీప్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంతకన్నా ముందే జో రూట్(18) బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో కెప్టెన్ స్టోక్స్ (41) మినహా.. మిగతావారెవ్వరూ అంతగా రాణించలేదు. కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారంటే.. వారి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగుల ఆధిక్యం లభించింది.

స్కోరు బోర్డు:

భారత్ తొలి ఇన్నింగ్స్: 445/10 (130.5 ఓవర్లు)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 319/10 (71.1 ఓవర్లు)

జాక్ క్రాలీ (సి) రజత్ పాటిదార్ (బి) అశ్విన్ 15, డకెట్ (సి) గిల్ (బి) కుల్దీప్ 153, ఓలీ పోప్ (ఎల్బీడబ్ల్యూ) సిరాజ్ 39, జో రూట్ (సి) యశస్వి (బి) బుమ్రా 18, బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) కుల్దీప్ 0, స్టోక్స్ (సి) బుమ్రా (బి) జడేజా 41, ఫోక్స్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13, రేహమ్ అహ్మద్ (బి) సిరాజ్ 6, టామ్ హార్ట్‌లీ (స్టంప్) ధ్రువ్ జురెల్ (బి) జడేజా 9, మార్క్ వుడ్ 4 నాటౌట్, జేమ్స్ అండర్సన్ (బి) సిరాజ్ 1; ఎక్స్‌ట్రాలు-20

వికెట్ల పతనం: 89-1, 182-2, 224-3, 225-4, 260-5, 299-6, 299-7, 314-8, 314-9, 319-10

బౌలింగ్: బుమ్రా (15-1-54-1), సిరాజ్ (21.1-2-84-4), కుల్దీప్ యాదవ్ (18-2-72-2), అశ్విన్ (7-0-37-1), జడేజా (10-0-51-2)

భారత్ రెండో ఇన్నింగ్స్: 196/2 (51 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్ 104 రిటైర్డ్ హర్ట్, రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) రూట్ 19, గిల్ 65 బ్యాటింగ్, రజత్ పాటిదర్ (సి) రెహాన్ (బి) టామ్ హార్ట్‌లీ 0, కుల్దీప్ యాదవ్ 3 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు-5

వికెట్ల పతనం: 30-1, 191-2

బౌలింగ్: జేమ్స్ అండర్సన్ (6-1-32-0), జో రూట్ (14-2-48-1), టామ్ హార్ట్‌లీ (15-2-42-1), మార్క్ వుడ్ (8-0-38-0), రెహాన్ అహ్మద్ (8-0-31-0)



Next Story

Most Viewed