సంచలన నిర్ణయం తీసుకున్న భారత సీనియర్ స్పిన్నర్

by Harish |

భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

సంచలన నిర్ణయం తీసుకున్న భారత సీనియర్ స్పిన్నర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్ అవుతున్నట్టు గురువారం ప్రకటించాడు. దాదాపు 25 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. గాయాలు, యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు 42 ఏళ్ల అమిత్ మిశ్రా తెలిపాడు. ‘క్రికెట్‌లో నా ఈ 25 ఏళ్ల జీవితం చిరస్మరణీయమైంది. క్రికెట్‌కు నాకు లెక్కకు మించిన జ్ఞాపకాలను ఇచ్చింది. ఎన్నో పాఠాలు నేర్పింది. మైదానంలో ప్రతి క్షణం నాకు అమూల్యమైనది. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా ప్రయాణాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చిన అభిమానులకు ధన్యవాదాలు’అని మిశ్రా ఓ జాతీయ మీడియాతో తెలిపాడు.

2003లో మిశ్రా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. 2017లో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. భారత్ తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడిన అతను మొత్తం 156 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో కూడా మిశ్రాకు మంచి రికార్డు ఉంది. 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు తీశాడు. లీగ్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతనిది 7వ స్థానం. ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు హ్యాట్రిక్ తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు అతని పేరిటే ఉంది. గతేడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌‌కు ఆడిన అతను రాజస్థాన్ రాయల్స్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. ప్లేయర్‌గా క్రికెట్‌కు దూరమైనప్పటికీ మిశ్రా కోచింగ్‌పై ఆసక్తిగా ఉన్నాడు. కోచింగ్,మెంటరింగ్, కామెంటరీ ద్వారా క్రికెట్‌తో సంబంధాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు.


Next Story