- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవ్ను కాపాడుకోవాలి.. కాంబ్లీ, పృథ్వీలా అవ్వకూడదు.. భారత మాజీ హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇటీవల గుజరాత్ టైటాన్స్పై సెకండ్ ఫాస్టెస్ట్ టీ20 శతకం బాదడంతో అతని పేరు మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యవంశీని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ, ఫ్రాంచైజీ కోచ్లపై ఉందన్నాడు. అతను మరో వినోద్ కాంబ్లీ, పృథ్వీ షాలా కాకూడదన్నాడు. ‘సచిన్ టెండూల్కర్ కూడా చిన్నతనంలో విజయం సాధించాడు. కేవలం ప్రతిభ వల్లే మాత్రమే కాదు. అతనికి మంచి మద్దతు లభించింది. స్వీయ నియంత్రణతోపాటు కోచ్, కుటుంబం అతన్ని రక్షించారు. మరోవైపు,వినోద్ కాంబ్లీ కూడా సచిన్తో సమానమైన ప్రతిభావంతుడే. కానీ, ఫేమ్ను, క్రమశిక్షణను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు. ఎంత వేగంగా దూసుకొచ్చాడో అంత వేగంగా పతనమయ్యాడు.పృథ్వీ షా కూడా అంతే.’అని చాపెల్ చెప్పుకొచ్చాడు. సూర్యవంశీని అతిగా కీర్తించొద్దని చెప్పాడు. అతన్ని రక్షించాలని, సరైన మార్గనిర్దేశం చేయాలని, ఆ బాధ్యత బీసీసీఐ, ఫ్రాంచైజీ, కోచ్లు, మీడియాపై ఉందన్నాడు. శారీరకంగా, మానసికంగా సూర్యవంశీ ఇంకా చిన్నపిల్లాడేనని, ఈ సందర్భంలో అతిగా ప్రశంసలు, అంచనాలు రెండు వైపుల పదును ఉన్న కత్తివంటివని చెప్పాడు.






