సచిన్ చెబితే నిజమే అనుకున్నా.. అందుకు ఇప్పటికీ బాధపడుతున్నా : ద్రవిడ్

by Harish |

2011లో ఇంగ్లాండ్ పర్యటనలో తాను చేసిన ఓ పొరపాటుకు ఇప్పటికీ చింతిస్తున్నానని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

సచిన్ చెబితే నిజమే అనుకున్నా..  అందుకు ఇప్పటికీ బాధపడుతున్నా : ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్ : 2011లో ఇంగ్లాండ్ పర్యటనలో తాను చేసిన ఓ పొరపాటుకు ఇప్పటికీ చింతిస్తున్నానని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్ అశ్విన్ యూట్యూబ్ చానెల్‌లో ద్రవిడ్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ‘ఒకసారి నేను డీఆర్‌ఎస్‌‌ను ఉపయోగించుకోలేదు. అందుకు ఇప్పటికీ చింతిస్తున్నా. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఎడ్జ్‌బస్టన్ టెస్టులో అది జరిగింది. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌ ఆడుతున్నప్పుడు ఒక శబ్ధం వినిపించింది. టుక్ లాంటి సౌండ్ వచ్చింది. కానీ, బ్యాట్‌కు తాకినట్టు అనిపించలేదు. బ్యాట్స్‌మెన్‌కు అలా అనిపించడం సాధారణమే. మైదానంలో బాగా సౌండ్ ఉంది. అంపైర్ సైమన్ టౌఫెల్ ఔట్ ఇచ్చాడు. అతను మంచి అంపైర్. అతను తీసుకున్న నిర్ణయాలను ఎక్కువగా సవాల్ చేయలేదు. వెంటనే సచిన్‌కు దగ్గరికి వెళ్లా. బ్యాట్‌కు తాకినట్టు అనిపించలేదని చెప్పా. ‘నువ్వు బంతిని ఆడావు. ఏదో సౌండ్ అయితే వచ్చింది.’అని సచిన్ చెప్పాడు. నిజమే కావచ్చని నేను కూడా అనుకున్నా. డీఆర్ఎస్ తీసుకోలేదు. డ్రెస్సింగ్ రూంలో రీప్లే చూశాక అసలు విషయం తెలిసింది. బంతి బ్యాటుకు తాకలేదు. బ్యాట్ నా షూలేస్‌కు తాకడంతో ఆ శబ్ధం వచ్చింది.’అని ద్రవిడ్ వివరించాడు. అయితే, ఆ పర్యటనలో ద్రవిడ్ అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టుల్లో మూడు శతకాలు బాది 461 రన్స్ చేశాడు. అయితే, ఆ సిరీస్‌లో టీమిండియా 4-0తో పరాజయం పాలైంది.


Next Story