‘విశ్వవిజేతలు’ మన అమ్మాయిలు.. వన్డే వరల్డ్ కప్‌ ముద్దాడిన టీమిండియా

by Phanindra |   (  Updated:2025-11-02 21:25:53  IST  )

‘విశ్వవిజేతలు’ మన అమ్మాయిలు. వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీని టీమిండియా మహిళలు అందుకున్నారు.

‘విశ్వవిజేతలు’ మన అమ్మాయిలు.. వన్డే వరల్డ్ కప్‌ ముద్దాడిన టీమిండియా
X

దిశ, స్పోర్ట్స్: వందకోట్ల మంది కల.. పదిహేను మంది ప్లేయర్ల కృషి.. ఎట్టకేలకు దశాబ్దాల నిరీక్షణకు తెర. వన్డే వరల్డ్ కప్‌ను భారత మహిళల జట్టు ముద్దాడింది. ప్రతి ఇల్లు, వీధి, నగరం, రాష్ట్రం.. తేడాలేకుండా ప్రజలంతా తమ కల నెరవేరినందుకు సంబరాల్లో మునిగిపోయారు. తరతరాల నిరీక్షణకు తెరపడిన ఈ క్షణాన్ని దేశం ఎన్నటికీ మరువదు. 1983లో కపిల్ డెవిల్స్ సాధించిన విజయం తర్వాత.. 2025లో కౌర్ సేన గెలుపు.. దేశంలో క్రికెట్ రూపురేఖలు మార్చిందని చరిత్ర చెప్పుకోవడం ఖాయం. ఆ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేసిన ఈ అమ్మాయిల జట్టును కూడా దేశం మరువదు.. మరువలేదు. ఎంతగొప్పగా ఆడుతున్నా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ లేకపోవడం ఈ టీంకు ఇంతకాలం మనసును మెలిపెట్టే వెలితి. ఆ బాధ తీరిన రోజు ఇది. ఐసీసీ టోర్నీల్లో వైఫల్యాలు చూసి చోకర్స్, ఐరన్ లెగ్స్.. అంటూ ఎన్నో పేర్లతో ఈ జట్టును అవమానించిన వాళ్లంతా నేడు ముక్తకంఠంతో ఈ టీంను ‘విశ్వవిజేతలు’ అంటూ సలామ్ కొట్టాల్సిందే.

ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని భారత మహిళల జట్టు.. తమ తొలి వన్డే వరల్డ్ కప్ అందుకుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై అద్భుతమైన విజయం సాధించింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అసాధారణ ప్రదర్శనతో అదరగొట్టిన వేళ.. సౌతాఫ్రికాకు ఓటమి తప్ప మరో మార్గం లేకుండా చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు స్మృతి మంధాన (45), షెపాలీ వర్మ (87) అదిరే ఆరంభం అందించారు. అయితే ఆ తర్వాత వచ్చిన జెమీమా (24), హర్మన్‌ప్రీత్ (20), అమన్‌జోత్ (12) పెద్దగా రాణించలేదు. అయితే దీప్తి శర్మ (58), రిచా ఘోష్ (34) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 298/7 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే బలమైన సౌతాఫ్రికా ముందు ఈ స్కోరు సరిపోతుందా? అని అంతా అనుమానించారు.

కట్టుదిట్టమైన బౌలింగ్..

భారీ ఛేజ్‌లో భారత బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. తొలి పవర్‌ప్లేలో సౌతాఫ్రికా బ్యాటర్లు భారీ షాట్లు ఆడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సఫారీ కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) సెంచరీతో ఆకట్టుకున్నా.. బ్రిట్స్ (23), బాష్ (0), సూన్ లూస్ (25) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. వోల్వార్ట్ రాణించినా ఆమెకు సహకారం కరువైంది. డెర్క్‌సన్ (35) కొంత పోరాడినా దీప్తి శర్మ అద్భుతమైన డెలివరీతో ఆమెను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వారందరూ ఒత్తిడికి తలొగ్గారు. మారిజాన్ కాప్ (4), సినాలో జఫ్తా (16), క్లో ట్రయాన్ (9), ఖాఖా (1) అందరూ విఫలమయ్యారు. చివర్లో డి క్లర్క్ (18)ను అవుట్ చేసిన దీప్తి.. సఫారీల కథ ముగించింది.

దీప్తి ఆల్‌రౌండ్ షో

వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఆడిన తొలి మ్యాచులో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి, ఒంటిచేత్తో జట్టును గెలిపించిన దీప్తి శర్మ మరోసారి అలాంటి ప్రదర్శనే చేసింది. వరల్డ్ కప్ ఫైనల్ వంటి కీలకమైన మ్యాచులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీతో మెరవడంతోపాటు.. ఏకంగా ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి వెన్ను విరిచింది. సెంచరీతో చెలరేగిన లారా వోల్వార్ట్, ప్రమాదకరమైన కాప్, జఫ్తా, డెర్క్‌సన్, డిక్లర్క్ అందర్నీ అవుట్ చేయడంతోపాటు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు ఖాకాను రనౌట్ చేసి.. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది.

షెఫాలీ మూడేళ్ల తర్వాత..

ప్రతీకా రావల్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షెఫాలీ వర్మ.. మూడేళ్ల తర్వాత మెరిసింది. ఆసీస్‌తో జరిగిన సెమీఫైనల్‌లో విఫలమైన ఆమె.. ఫైనల్‌లో అద్భుతంగా ఆడింది. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది. 2022 జులై తర్వాత వన్డేల్లో షెఫాలీ చేసిన తొలి అర్ధశతకం ఇదే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఫామ్ లేమితో తడబడిన ఆమె.. జట్టులో చోటు కూడా కోల్పోయింది. అందుకే టోర్నీ ఆరంభంలో ఆమె స్థానంలో ప్రతీకను తీసుకున్నారు. ప్రతీక గాయపడటంతో జట్టులోకి వచ్చిన షెఫాలీ.. మూడేళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్‌ వంటి బిగ్ స్టేజీపై హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. బౌలింగ్‌లో కూడా సూన్ లూస్, మారిజాన్ కాప్ ఇద్దరి వికెట్లతో ఆకట్టుకుంది. అద్భుతంగా రాణించిన ఆమెకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

రిచా కన్నా ముందు అమన్‌జోత్!

ఈ మ్యాచులో హర్మన్ ప్రీత్ కౌర్ అవుటైన తర్వాత ఫామ్‌లో ఉన్న రిచా ఘోష్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అమన్‌జోత్ కౌర్‌ను బ్యాటింగ్‌కు పంపారు. చివరి 10 ఓవర్లే మిగిలి ఉన్న సమయంలో ఫినిషర్ అయిన రిచాను పంపకుండా అమన్‌జోత్‌ను పంపడంపై ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. బిగ్ హిట్టర్ అయిన రిచాను ఇలా వెనక్కు నెట్టడం ఏమాత్రం సరికాదని విశ్లేషకులు కూడా పెదవి విరిచారు.

స్మృతి రికార్డు

ఓపెనర్ స్మృతి మంధాన హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్‌లో చేసిన 45 పరుగులతో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. ఆమె ఈ సీజన్‌లో 434 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరిట ఉండేది. 2017 ఎడిషన్‌లో మిథాలీ 409 పరుగులు చేసింది.

కౌర్ కూడా..

టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అరుదైన రికార్డు సాధించింది. ఫైనల్‌లో కేవలం 20 పరుగులే చేసినప్పటికీ.. మహిళల వన్డే వరల్డ్ కప్‌ నాకౌట్ గేమ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించింది. నాకౌట్ గేమ్స్‌లో నాలుగు ఇన్నింగ్సుల్లోనే హర్మన్ 331 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. క్లార్క్ ఆరు ఇన్నింగ్సుల్లో 330 పరుగులు చేసింది.

చీర్ చేసిన రోహిత్

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, భార్య రితికతో కలిసి భారత అమ్మాయిలను చీర్ చేశాడు. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు వచ్చిన అతను కెమెరా కంటికి చిక్కాడు. ఐసీసీ చైర్మన్ జై షా, నీతా అంబానీ తదితరులతో కలిసి మ్యాచ్ చూశాడు రోహిత్.

వరల్డ్ ఛాంపియన్స్‌లో తెలుగు అమ్మాయిలు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లున్నారు. వీరే శ్రీచరణి, అరుంధతి రెడ్డి. వీరిలో శ్రీచరణి.. టోర్నీ ఆసాంతం అద్భుతమైన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నది. వరల్డ్ కప్‌లో 14 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీప్తి శర్మ తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. అరుంధతికి మాత్రం ఈ టోర్నీలో ఆడే అవకాశం దక్కలేదు. టోర్నీ ఆసాంతం బెంచ్‌కే పరిమితమైంది.

ఇది అమ్మాయిల ‘83’..

భారత క్రికెట్‌కు ఊపిరి ఊదిన ఘట్టంగా 1983 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని చెప్పుకుంటారు. ఆ తర్వాత అంచెలంచెలుగా భారత పురుషుల క్రికెట్ ఎదుగుతూ వచ్చింది. ధోనీ హయాంలో మరో వరల్డ్ కప్ కూడా నెగ్గాం. రెండు టీ20 వరల్డ్ కప్‌లు, మూడు ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా భారత పురుషుల టీం ఖాతాలో ఉన్నాయి. కానీ 1978 నుంచే క్రికెట్ ఆడుతున్న మహిళలు మాత్రం ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేకపోయారు. రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు, ఒకసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లినా ట్రోఫీ గెలవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు 2025లో స్వదేశంలో వన్డే వరల్డ్ కప్‌ను ముద్దాడి.. మహిళా క్రికెట్‌లో సువర్ణ అధ్యాయానికి నాంది పలికారు. ఇది కచ్చితంగా మహిళల క్రికెట్ టీంకు ‘83’ మూమెంట్ వంటిదే.

స్కోరు బోర్డు

టీమిండియా ఇన్నింగ్స్: 298/7 (50 ఓవర్లలో)

స్మృతి మంధాన (సి)జఫ్తా(బి)ట్రయాన్ 45, షెఫాలీ వర్మ (సి)లూస్(బి)ఖాఖా 87, జెమీమా (సి)వోల్వార్ట్(బి)ఖాఖా 24, హర్మన్‌ప్రీత్ (బి)మ్లాబా 20, దీప్వి శర్మ (రనౌట్)ట్రయాన్ 58, అమన్‌జోత్ (సి అండ్ బి)డిక్లర్క్ 12, రిచా ఘోష్ (సి)డెర్క్‌సన్(బి)ఖాఖా 34, రాధా యాదవ్ 3 నాటౌట్, ఎక్స్‌ట్రాలు:15

బౌలింగ్: మారిజానే కాప్ (10-1-59-0), అయబోంగా ఖాఖా (9-0-58-3), నొంకునులెకో మ్లాబా (10-0-47-1), నడైన్ డి క్లర్క్ (9-0-52-1), సూన్ లూస్ (5-0-34-0), క్లో ట్రయాన్ (7-0-46-1)

సౌతాఫ్రికా ఇన్నింగ్స్: 246 ఆలౌట్ (45.3 ఓవర్లలో)

లారా వోల్వార్ట్ (సి)అమన్‌జోత్(బి)దీప్తి 101, టాజ్మిన్ బ్రిట్స్ (రనౌట్)అమన్‌జోత్ 23, అన్నెకే బాష్ (ఎల్బీడబ్ల్యూ)శ్రీచరణి 0, సూన్ లూస్ (సి అండ్ బి)షెఫాలీ వర్మ 25, మారిజానే కాప్ (సి)రిచా(బి)షెఫాలీ 4, సినాలో జఫ్తా (సి)రాధ(బి)దీప్తి 16, అనెరీ డెర్క్‌సన్ (బి)దీప్తి 35, క్లో ట్రయాన్ (ఎల్బీడబ్ల్యూ)దీప్తి 9, డి క్లర్క్ (సి)హర్మన్(బి)దీప్తి 18, ఖాఖా (రనౌట్)దీప్తి 1, మ్లాబా 0 నాటౌట్, ఎక్స్‌ట్రాలు: 14

బౌలింగ్: రేణుకా సింగ్ (8-0-28-0), క్రాంతి గౌడ్ (3-0-16-0), అమన్‌జోత్ కౌర్ (4-0-34-0), దీప్తి శర్మ (9.3-0-39-5), శ్రీచరణి (9-0-48-1), రాధా యాదవ్ (5-0-45-0), షెఫాలీ వర్మ (7-0-36-2)

Next Story