నిశ్శబ్ద స్వర్ణం.. విశ్వ విజేత జ్యోతి యర్రాజీ అద్భుత రికార్డు

by Malleboina Mahesh |

దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ 2025లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ సరికొత్త చరిత్ర సృష్టించింది.

నిశ్శబ్ద స్వర్ణం.. విశ్వ విజేత జ్యోతి యర్రాజీ అద్భుత రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియాలోని గుమి వేదికగా జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌ (Asian Athletics Championships) 2025లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో కేవలం 12.96 సెకన్లలో లక్ష్యాన్ని చేరి సరికొత్త ఛాంపియన్‌షిప్ రికార్డుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ చారిత్రాత్మక విజయం (Historic victory) సాధించిన వేళ మైదానంలో ప్రేక్షకుల కేరింతలు లేవు, కరతాళ ధ్వనులు లేవు. వర్షం కారణంగా స్టేడియం ఖాళీగా ఉండటంతో, ఎటువంటి హంగామా లేని నిశ్శబ్ద వాతావరణంలోనే ఆమె దేశం గర్వించే విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఖాళీ స్టేడియంలో ఎవరూ లేకపోయినా, జ్యోతి ఒంటరిగా పరుగెత్తి చివరకు తన లక్ష్యాన్ని ముద్దాడిన తీరు నెటిజన్లను కదిలిస్తోంది. "అభినందనలు తెలిపే వారు లేకున్నా.. తన ప్రతాపాన్ని ప్రపంచం వినేలా చాటింది" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2023లోనూ వర్షం కారణంగా దాదాపు ఖాళీ స్టేడియంలోనే ఆమె పతకం సాధించగా, ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ కావడం విశేషం. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, ఎన్ని గాయాలు చుట్టుముట్టినా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోయి భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన 'హర్డిల్స్ క్వీన్' జ్యోతి ఇప్పుడు అసలైన సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది.

Next Story