సింగపూర్ ఓపెన్: సాత్విక్-చిరాగ్ జోడీ శుభారంభం.. గాయంతో లక్ష్యసేన్ అవుట్

by Phanindra |

సింగపూర్ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. అయితే స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

సింగపూర్ ఓపెన్: సాత్విక్-చిరాగ్ జోడీ శుభారంభం.. గాయంతో లక్ష్యసేన్ అవుట్
X

దిశ, స్పోర్ట్స్: సింపూర్ ఓపెన్‌లో భారత టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. చిరాగ్‌కు వెన్నుగాయం వల్ల మార్చి నెలలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ నుంచి ఈ జోడీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆడుతున్న తొలి మ్యాచులో మలేసియాకు చెందిన చూంగ్ హాన్ జియాన్, మహమ్మద్ హైకల్ జోడీపై సాత్విక్, చిరాగ్ జోడీ చెలరేగింది. కేవలం 40 నిమిషాల్లోనే 21-16, 21-13 తేడాతో మలేసియా జంటను ఓడించింది. అయితే మరో స్టార్ లక్ష్య సేన్‌ను దురదృష్టం వెంటాడింది.


చైనీస్ తైపీ ప్లేయర్ లిన్ చున్ యీతో జరిగిన మ్యాచులో నిర్ణయాత్మక మూడో గేమ్ మధ్యలో గాయం కారణంగా సేన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక శివానీ జోడీ కూడా రాణించింది. అమెరికాకు చెందిన చెన్ జీ యీ, ఫ్రాన్సెస్కా కార్బెట్ జంటపై 21-16, 21-19 తేడాతో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్, అమృత ప్రముతేశ్-సోనాలీ సింగ్ జోడీ కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.

Next Story