ఐపీఎల్‌లో మోస్ట్ వాల్యూబుల్ టీమ్‌గా ఆర్సీబీ.. సీఎస్కే‌ను వెనక్కినెట్టి

by Harish |

ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తన బ్రాండ్ వాల్యూను భారీగా పెంచుకుంది.

ఐపీఎల్‌లో మోస్ట్ వాల్యూబుల్ టీమ్‌గా ఆర్సీబీ.. సీఎస్కే‌ను వెనక్కినెట్టి
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తన బ్రాండ్ వాల్యూను భారీగా పెంచుకుంది. ఐపీఎల్‌లో మోస్ట్ వాల్యూబుల్ ఫ్రాంచైజీగా అవతరించింది. ఇంతకుముందు అగ్రస్థానంలో ఉన్న చెన్నయ్ సూపర్ కింగ్స్‌ను వెనక్కినెట్టి టాప్ ఫ్రాంచైజీగా నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాక్ హౌలిహన్ లోకీ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ 13.9 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లు(రూ.1,56,568 కోట్లు)కు చేరింది. గతేడాది పోలిస్తే దాదాపు రూ.1.34 లక్షల కోట్లు పెరిగింది. అలాగే, ఐపీఎల్ చాంపియన్ ఆర్సీబీ మోస్ట్ వాల్యూబుల్ జట్టుగా నిలిచింది. 269 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో రూ.2,259 కోట్లు)‌తో అగ్రస్థానంలో నిలిచింది.ఇంతకుముందు టాప్ పొజిషన్‌లో ఉన్న చెన్నయ్ సూపర్ కింగ్స్(రూ.1,972 కోట్లు) మూడో స్థానానికి పడిపోయింది. ముంబై ఇండియన్స్(రూ.2,032 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్(రూ. 1,948 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్(రూ.1,321 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్(రూ.1,303 కోట్లు), రాజస్థాన్ రాయల్స్(రూ.1,252 కోట్లు), గుజరాత్ టైటాన్స్(1,218 కోట్లు) జట్లు 6 నుంచి 8 స్థానల్లో ఉన్నాయి. ఇక, ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ అన్ని జట్ల కంటే ఎక్కువ బ్రాండ్ వాల్యూను పెంచుకుంది. గతేడాది కంటే 39.6 శాతం వృద్ధిని నమోదు చేసిన ఆ జట్టు రూ.1,209 కోట్లతో 9వ స్థానంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా 34 శాతం వృద్ధిని నమోదు చేసింది. రూ.1,047 కోట్లతో చివరి స్థానంలో నిలిచింది. స్పాన్సర్‌షిప్, మీడియా ఒప్పందాలు, డిజిటల్, టీవీ వ్యూయర్‌షిప్‌లో పెరుగుదల ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ వృద్ధికి దోహదపడ్డాయి.


Next Story