లైంగిక వేధింపుల కేసు ఎఫెక్ట్.. యశ్ దయాల్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్సీబీ

by Harish |

లైంగిక వేధింపుల కేసు ఎఫెక్ట్.. యశ్ దయాల్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్సీబీ
X

దిశ, స్పోర్ట్స్ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌలర్ యశ్ దయాల్ విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2026 మొత్తానికి అతన్ని దూరంపెట్టింది. వ్యక్తిగత కారణాలతో అతను ఈ సారి లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ మంగళవారం వెల్లడించారు. ‘యశ్ జట్టులో చేరడని కన్ఫార్మ్ చేస్తున్నా. అతను ప్రస్తుతం వ్యక్తిగత సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఇప్పటివరకూ మేము అతనికి మద్దతుగానే ఉన్నాం. అతన్ని రిటైన్ చేసుకోవడమే అందుకు నిదర్శనం. ఈ సీజన్‌కు దూరంగా ఉన్నా అతను మా కాంట్రాక్ట్‌లోనే ఉంటాడు. అతనితో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. నేను ఈ రోజు కూడా మాట్లాడా. కానీ, ఈ సమయంలో అతను జట్టులో చేరడం అతనికి, ఫ్రాంచైజీకి మంచిది కాదని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.’అని బోబాట్ తెలిపారు.

2024, 2025 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన యశ్ దయాల్ ఆ జట్టు బౌలింగ్ ఎటాక్‌లో కీలకంగా మారాడు. గతేడాది బెంగళూరు తొలి టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 15 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. క్రికెట్ కెరీర్ చూపిస్తానంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడని రాజస్థాన్‌కు చెందిన ఓ మైనర్ అతనిపై కేసు పెట్టింది. గాజియాబాద్‌కు చెందిన ఓ యువతి కూడా యశ్‌పై లైంగిక ఆరోపణలు చేసింది.


Next Story