భారత్ కంటే భార్య ఎన్నికలే ముఖ్యమా..? జడేజాపై తీవ్ర విమర్శలు

by Disha Web Desk 19 |
భారత్ కంటే భార్య ఎన్నికలే ముఖ్యమా..? జడేజాపై తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నిలో గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జడేజా ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్‌కు సైతం దూరమయ్యాడు. ఇక, జడేజా గాయం నుండి కోలుకోవడంతో డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ టూర్‌కు ఎంపిక చేశారు. కానీ, జడేజా తనకు గాయం ఇంకా నయం కాలేదని చివర్లో బంగ్లాదేశ్ టూర్ నుండి తప్పుకున్నాడు. గాయం నయం కాలేదని సిరీస్ నుండి తప్పుకున్నా జడేజా.. విశ్రాంతి తీసుకోకుండా తన భార్య తరుఫున గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్ నగర్ నార్త్ నియోజకవర్గం నుండి బీజేపీ తరుఫున బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో జడేజా తన భార్యకు మద్దతుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. దగ్గరుండి భార్యతో నామినేషన్ వేయించిన జడేజా.. భార్య గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు. తన భార్యకు ప్రజా సేవ అంటే ఇష్టమని.. తను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తుందని దీమా వ్యక్తం చేస్తున్నాడు. భార్య కోసం జడేజా ప్రచారం చేయడం బాగానే ఉన్న.. సొంత స్వార్థాల కోసం దేశం తరుఫున ప్రాతినిథ్యం వహించకుండా తప్పించుకోవడం సిగ్గుచేటని జడేజాపై విమర్శలు గుప్పి్స్తున్నారు.

భార్య కోసమే జడేజా.. గాయం పేరుతో బంగ్లాదేశ్ సిరీస్ నుండి తప్పుకున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్‌లో కూడా బీజేపీ రాజకీయాలు చేస్తోందని.. అమిత్ షా కొడుకు జై షా సపోర్ట్‌తోనే జడేజా బంగ్లా టూర్‌కు వెళ్లకుండా బీజేపీ కోసం ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రవీంద్ర జడేజాకు దేశం కంటే భార్య ఎన్నికలే ముఖ్యమైయ్యాయని.. జడేజాను టీమిండియాను నుండి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed