గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయిన సింధు.. తొలి రౌండ్‌లోనే ఇంటికిి

by Harish |   (  Updated:2025-09-10 13:45:14  IST  )

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది.

గెలిచే మ్యాచ్‌ను చేజేతులా కోల్పోయిన సింధు.. తొలి రౌండ్‌లోనే ఇంటికిి
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌‌లో సింధు 21-15, 16-21, 19-21 తేడాతో డైన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్ చేతిలో పరాజయం పాలైంది. అలవోకగా గెలిచే మ్యాచ్‌ను సింధు చేజేతులా కోల్పోయింది. తొలి గేములో నెగ్గి మ్యాచ్‌‌‌ను బాగానే ఆరంభించింది. రెండో గేములో కూడా అదే జోరును కొనసాగించిన సింధు చాలా సేపు ఆధిక్యంలో నిలిచింది. కానీ, అనూహ్యంగా పట్టు కోల్పోయింది. ఆమె తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న క్రిస్టోఫర్సన్ ఒక్కో పాయింట్ సాధిస్తూ 13-13తో స్కోరును సమం చేయడమే కాకుండా రెండో గేము గెలిచింది. మూడో గేములో సింధు తీవ్రంగా పోరాడింది. ఒక దశలో 18-16తో లీడ్‌లోకి వెళ్లినా మరోసారి అవకాశాన్ని చేజార్చుకుంది. పలు తప్పిదాలు చేయడంతో సింధు విజయం ముగింట బోల్తా పడాల్సి వచ్చింది. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే.

లక్ష్యసేన్, ప్రణయ్ ముందంజ

పురుష సింగిల్స్ ప్లేయర్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ టోర్నీలో శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో ప్రణయ్ 21-17, 21-14 తేడాతో చైనా ప్లేయర్ లు గువాంగ్ జు‌ను చిత్తు చేశాడు. కేవలం 44 నిమిషాల్లోనే మ్యాచ్‌‌ను సొంతం చేసుకుని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. ఇక, లక్ష్యసేన్ తొలి రౌండ్ దాటడానికి శ్రమించాల్సి వచ్చింది. చైనీస్ తైపీకి చెందిన వాంగ్ ట్జు వెయ్‌పై 20-22, 21-16, 15-21 తేడాతో పోరాడి గెలిచాడు. యువ క్రీడాకారులు ఆయుశ్ శెట్టి, కిరణ్ జార్జ్ కూడా రెండో రౌండ్‌లో అడుగుపెట్టారు. తొలి రౌండ్‌లో ఆయుశ్ 15-21, 21-19, 21-13 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ సు లి యాంగ్‌పై, జార్జ్ 21-16, 21-11 తేడాతో సింగపూర్ ఆటగాడు జియా హెంగ్ జాసన్‌పై విజయం సాధించారు.


Next Story