రెండో టెస్టులో భారత్ తుది జట్టులో మార్పులు?.. వారిద్దరికి చోటు

by Harish |

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే.

రెండో టెస్టులో భారత్ తుది జట్టులో మార్పులు?.. వారిద్దరికి చోటు
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైన విషయం తెలిసిందే. గెలిచే మ్యాచ్‌లో ఓడటం భారత జట్టుకే కాదు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. కొంతకాలంగా టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గంభీర్‌‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొల టెస్టులో సాయి సుదర్శన్‌ను పక్కనపెట్టడం, 3వ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడం, స్పెషలిస్ట్ బ్యాటర్లను కాకుండా ఆల్‌రౌండర్లపై విశ్వాసం ఉంచడం వంటి పలు విషయాల్లో గంభీర్‌ ఆలోచనలతో మాజీ క్రికెటర్లు ఏకీభవించడం లేదు. శనివారం నుంచి గువహతి వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా, ఓడినా సిరీస్ సౌతాఫ్రికా కైవసమవుతుంది. కాబట్టి, సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే రెండో టెస్టులో భారత్ గెలవాల్సిందే. ఈ కీలకమైన మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో మార్పులు చేయొచ్చు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్, సాయి సుదర్శన్‌కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశం ఉంది.

గిల్‌పై నో క్లారిటీ

తొలి టెస్టులో మెడ నొప్పితో మైదానం వీడిన కెప్టెన్ గిల్ రెండో టెస్టు ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. జట్టుతో కలిసి అతను గువహతికి వచ్చినప్పటికీ ప్రాక్టీస్‌కు దూరంగా ఉంటున్నాడు. దీంతో రెండో టెస్టులో అతను బరిలోకి దిగడం కష్టమేనని తెలుస్తోంది. గిల్ దూరమైతే రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. గిల్‌ ఆడటంపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. గురువారం అతను మీడియాతో మాట్లాడుతూ.. గిల్ కచ్చితంగా ఆడతాడని చెప్పలేకపోయాడు. ‘గిల్ కోలుకుంటున్నాడు. అతనిపై రేపు నిర్ణయం తీసుకుంటాం. పూర్తిగా కోలుకుంటేనే ఆడతాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడానికి మా వద్ద మంచి ప్లేయర్లు ఉన్నారు.’అని కోటక్ తెలిపారు.

గిల్ స్థానంలో సుదర్శన్

ఒకవేళ గిల్ ఆడకపోతే అతని స్థానంలో సాయి సుదర్శన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెంచ్‌పై సుదర్శన్‌తోపాటు పడిక్కల్ ఉన్నాడు. కానీ, సుదర్శన్‌ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గుచూపనుంది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో సుదర్శన్ 87, 39 రన్స్ చేశాడు. తొలి టెస్టులో అతన్ని పక్కపెట్టడం విమర్శలకు దారితీసింది. సుదర్శన్ తుది జట్టులోకి వస్తే అతను 3వ స్థానంలో బ్యాటింగ్‌‌కు రానున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆ స్థానంలో సుందర్‌కు బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ ప్రయోగం ఫలించలేదు. సుందర్ 3వ స్థానంలో ఆకట్టుకోలేకపోయాడు. రెండో టెస్టులో అతను 7 లేదా 8వ స్థానంలో క్రీజులోకి రావొచ్చు. గిల్ వచ్చే 4వ స్థానంలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్‌కు రానున్నాడు.

నితీశ్‌కు చాన్స్?

తెలుగు కుర్రాడు, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి రెండో టెస్టులో బరిలోకి దిగొచ్చు. తొలి టెస్టులోఅతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతన్ని జట్టు నుంచి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత్‘ఏ’ తరపున సౌతాఫ్రికా ‘ఏ’తో వన్డే సిరీస్ ఆడాడు. నితీశ్‌ను తిరిగి రెండో టెస్టు కోసం భారత జట్టులో చేర్చారు. గువహతి టెస్టులో రైట్ అండ్ లెఫ్ట్ బ్యాటర్ల కాంబినేషన్‌‌ను సమతుల్యం చేయడానికి నితీశ్‌ను తుది జట్టులో తీసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. దీనివల్ల టాప్-6లోముగ్గురు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటారు. అక్షర్ పటేల్‌ను తప్పించి అతని స్థానంలో నితీశ్‌ను తీసుకోనున్నట్టు సమాచారం.


Next Story