భారత్‌కు పాక్ టీమ్ రాక.. పీసీబీ క్లారిటీ!

by Disha Web Desk 4 |
భారత్‌కు పాక్ టీమ్ రాక.. పీసీబీ క్లారిటీ!
X

న్యూఢిల్లీ : ఆసియా కప్-2023కు సంబంధించి పాక్ ఆతిథ్యంపై బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆసియా కప్ ఆడేందుకు టీమ్ ఇండియా పాకిస్తాన్‌లో పర్యటించకపోతే ప్రపంచకప్ కోసం పాక్ జట్టు భారత్‌కు వెళ్లదని హెచ్చరికలకు దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెనక్కి తగ్గింది. వన్డే వరల్డ్ కప్-2023కు పాక్ జట్టును పంపించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీకి పీసీబీ ధ్రువీకరించినట్టు అక్కడి మీడియా పేర్కొంది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ప్రపంచకప్ వేదికలను పరిశీలించేందుకు సెక్యూరిటీ టీమ్ భారత్‌కు వెళ్తుందని కూడా తెలిపింది. ఇటీవల ప్రపంచకప్‌లో పాల్గొనడంపై పీసీబీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని ఐసీసీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్‌లో పాల్గొనకపోతే భారీ జరిమానా కట్టాల్సి ఉంటుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ పీసీబీకి సందేశం పంపినట్టు సమాచారం.

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ ఇవ్వడంతో పీసీబీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా, ఆసియా కప్-2023 ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉన్నాయి. అయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమ్ ఇండియా పాకిస్తాన్‌లో పర్యటించందని, తటస్థ వేదికగా ఆడతామని బీసీసీఐ సెక్రెటరీ జైషా స్పష్టం చేశారు. టీమ్ ఇండియా పాక్‌లో పర్యటించకపోతే వన్డే వరల్డ్ కప్‌ కోసం పాక్ జట్టు భారత్‌లో పర్యటించిందని పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ హెచ్చరించారు. పీసీబీ బెదిరింపులకు లొంగని బీసీసీఐ తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పీసీబీ హైబ్రిడ్ మోడల్‌‌లో ఆసియా కప్ నిర్వహిస్తామని ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కి ప్రతిపాదనలు పంపింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.


Next Story

Most Viewed