Paralympics 2024 : షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం.. మనీశ్ నర్వాల్‌కు రజతం

by Harish |

పారిస్ పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.

Paralympics 2024 : షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం.. మనీశ్ నర్వాల్‌కు రజతం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ పారాలింపిక్స్‌లో రెండో రోజు భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే మూడు పతకాలు దక్కగా.. తాజాగా మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. ముఖ్యంగా భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే అవనీ లేఖరా స్వర్ణం సాధించగా.. మోనా అగర్వాల్ కాంస్యంతో మెరిసిన విషయం తెలిసిందే. అదే జోరును కొనసాగిస్తూ షూటర్ మనీశ్ నర్వాల్ భారత్‌కు షూటింగ్‌లో మూడో పతకం అందించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతం దక్కించుకున్నాడు. ఫైనల్‌లో 234.9 స్కోరు చేసిన మనీశ్ రెండో స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో మనీశ్ రెండు స్వర్ణాలు సాధించాడు. 50 మీటర్ల పిస్టోల్ ఎస్‌హెచ్1 వ్యక్తిగత కేటగిరీతోపాటు 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 మిక్స్‌డ్ ఈవెంట్‌లో బంగారు పతకాలు గెలుచుకున్నాడు. సమ్మర్ పారాలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 6వ భారత అథ్లెట్‌గా మనీశ్ రికార్డు నెలకొల్పాడు. అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల రేసులో ప్రీతి పాల్ కాంస్యం సాధించిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఒకే రోజు భారత్ నాలుగు పతకాలు సాధించింది. అందులో ఓ స్వర్ణం, ఓ రజతం, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.

Next Story