మకావు ఓపెన్‌లో శుభారంభం చేసిన తెలుగు కుర్రాడు తరుణ్

by Harish |

మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్, తెలుగు కుర్రాడు తరుణ్ మన్నెపల్లి శుభారంభం చేశాడు.

మకావు ఓపెన్‌లో శుభారంభం చేసిన తెలుగు కుర్రాడు తరుణ్
X

దిశ, స్పోర్ట్స్ : మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్, తెలుగు కుర్రాడు తరుణ్ మన్నెపల్లి శుభారంభం చేశాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో తరుణ్ తన సహచరుడు మన్‌రాజ్ సింగ్‌ను ఓడించాడు. 39 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో తరుణ్ 21-19, 21-13 తేడాతో విజయం సాధించాడు. రెండో రౌండ్‌‌లో అతను హాంకాంగ్ ప్లేయర్ లి చెయుక్ యియుతో తలపడనున్నాడు. భారత స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ కూడా రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 21-8, 21-14 తేడాతో సౌత్ కొరియాకు చెందిన జియెన్ హ్యొక్ జిన్‌ను మట్టికరిపించాడు.యువ ఆటగాడు ఆయుశ్ శెట్టి 21-10, 21-11 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హుయాంగ్‌ను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టాడు.

ఉమెన్స్ సింగిల్స్‌లో రక్షిత రామరాజ్ ముందంజ వేసింది. తొలి రౌండ్‌లో చోయికీవాంగ్(థాయిలాండ్)పై 21-18, 17-21, 20-22 తేడాతో పోరాడి గెలిచింది. తొలి గేము కోల్పోయి తర్వాత రక్షిత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు, మూడు సెట్లు గెలిచి మ్యాచ్ సొంతం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల్ జోడీ 21-10, 21-15 తేడాతో మక్కసాసి‌థోర్న్-లైసువాన్(థాయిలాండ్) జంటపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది. బుధవారం భారత్‌‌కు నిరాశ ఫలితాలు కూడా ఎదురయ్యాయి. భారత స్టార్ ఆటగాడు హెచ్.ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. ఇండోనేషియాకు చెందిన మార్సెల్ల్యానో చేతిలో 18-21, 21-15, 21-16 తేడాతో పోరాడి ఓడిపోయాడు. అలాగే, కిరణ్ జార్జ్, సుబ్రమణియన్, కరుణాకరణ్, సంజీవి యువ ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టారు. ఉమెన్స్ సింగిల్స్‌లో అనుపమ ఉపాధ్యాయ, అన్మోల్ ఖర్బ్, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ కూడా పరాజయం పాలయ్యారు.


Next Story