మా ‘మన్ కీ బాత్’ వినండి.. ప్రధాని మోడీకి రెజ్లర్ల విజ్ఞప్తి

by Disha Web Desk 13 |
మా ‘మన్ కీ బాత్’ వినండి.. ప్రధాని మోడీకి రెజ్లర్ల విజ్ఞప్తి
X

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తమ సమస్యలను వినాలని భారత మహిళా రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ కోరారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌‌పై భారత టాప్ రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీలోని జంతర మంతర్ వద్ద వారు చేపట్టిన నిరసన దీక్ష బుధవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ..‘ప్రధాని మోడీ ‘బేటి బచావో-బేటి పడావో’ అని చెబుతారు. మేము పతకాలు గెలిచినప్పుడు ఇంటికి పిలిచి సత్కరిస్తారు. కూతుళ్లుగా పిలుస్తారు. కానీ, మా ‘మన్ కీ బాత్’ మాత్రం వినరు’ అని ఆవేదన చెందారు.

‘ఇప్పుడు మేము మా సమస్యలు వినాలని ఆయనను కోరుతున్నాం. మేము చెప్పే నిజాలు ప్రధానికి చేరడం లేదు. ఆయనను కలిసి మా సమస్యలను విన్నివించాలనుకుంటున్నాం’ అని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్ బ్రాంజ్‌ మెడలిస్ట్ భజరంగ్ పూనియా మాట్లాడుతూ..‘భారత బిడ్డలు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు. వారికి న్యాయం చేయండి’ అని ప్రధానిని కోరాడు. కాగా, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రెజ్లర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed