13 ఏళ్ల తర్వాత ఆ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ

by Yella Dhawani Reddy |

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు.

13 ఏళ్ల తర్వాత ఆ ట్రోఫీ ఆడనున్న కోహ్లీ
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో ప్లేయర్లు అందుబాటులో ఉంటే తప్పకుండా దేశవాళీ లీగ్‌ల్లో ఆడాలని ఇటీవల BCCI ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న లీగ్‌ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కోహ్లీ బరిలో దిగనున్నాడు. జనవరి 23 నుంచి ఢిల్లీ, సౌరాష్ట్ర మ్యాచ్‌ మొదలవనుంది. కానీ, ఈ మ్యాచ్‌కు మెడనొప్పి కారణంగా కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. ఈ మేరకు కోహ్లీ ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు సమాచారం ఇచ్చినట్లు ఢిల్లీ ప్రధాన కోచ్ శరణ్‌దీప్ సింగ్ పీటీఐకి తెలిపారు.

2012లో చివరిసారిగా..

విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో యూపీతో టెస్టులో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడు. 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కోహ్లీ.. ఆ తర్వాత ఈ మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్స్‌లో 43 రన్స్ స్కోరు చేశాడు. తాజాగా 13 ఏళ్ల తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్‌లో కోహ్లీ బరిలో దిగబోతున్నాడు.

దేశవాళీ క్రికెట్ బాట పట్టిన స్టార్ క్రికెటర్లు

కాగా, ఈనెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్‌ల్లో భారత స్టార్‌ క్రికెటర్లు బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ముంబై తరఫున రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌.. పంజాబ్‌ తరఫున శుభ్‌మన్‌ గిల్‌ బరిలోకి దిగనున్నారు. సీనియర్ ప్లేయర్లు దేశీయ టోర్నమెంట్లలో, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో కూడా ఆడాలా వద్దా అనే అంశంపై గత కొన్నిరోజులుగా భారత క్రికెట్‌లో నిరంతర చర్చ జరుగుతోంది. అయితే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో ఓటమి.. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన తర్వాత, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దీనిపై నొక్కిచెప్పారు. దీంతో BCCI కూడా సీనియర్ ఆటగాళ్లకు దీనిని తప్పనిసరి చేసింది.

Next Story