ఖోఖో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన భారత్.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం

by Harish |

భారత్ ఆతిథ్యమిస్తున్న తొలి ఖోఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది.

ఖోఖో వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన భారత్.. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం
X

దిశ, స్పోర్ట్స్ : భారత్ ఆతిథ్యమిస్తున్న తొలి ఖోఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఢిల్లీలో సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 42-37 తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ వజీర్ ప్రతీక్ నేతృత్వంలోనే భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా భారత్ ఎటాకింగ్ చేయగా.. కెప్టెన్ ప్రతీక్, రామ్‌జీ కశ్యప్, సచిన్ భార్గో రాణించడంతో టర్న్1లో 24 పాయింట్లు సాధించింది. అయితే, టర్న్‌ 2లో నేపాల్ 20 పాయింట్లతో పుంజుకుంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌ ముగిసే వరకు భారత్ 24-20తో స్వల్ప ఆధిక్యం సాధించింది. టర్న్‌3లో భారత్ 18 పాయింట్లు సాధించడంతో.. ఆఖరి టర్న్‌లో నేపాల్ విజయానికి 22 పాయింట్లు అవసరమయ్యాయి. 4వ టర్న్‌లో భారత డిఫెండర్లు ఆకట్టుకున్నారు. గౌతమ్, వాయికర్, గన్‌పుల్, సుబ్రమణి నేపాల్ ఎటాకర్ల నుంచి తప్పించుకుంటూ సమయాన్ని కరిగించారు. దీంతో ప్రత్యర్థి ఒత్తిడిలోకి వెళ్లింది. నేపాల్ 18 పాయింట్లే సాధించడంతో భారత్ విజయం లాంఛనమైంది. నేడు రెండో గ్రూపు మ్యాచ్‌లో బ్రెజిల్‌తో తలపడనుంది. మరోవైపు, భారత మహిళల ఖోఖో జట్టు నేడు తమ పోరాటాన్ని మొదలుపెట్టనుంది. తొలి గ్రూపు మ్యాచ్‌లో మలేసియాతో ఆడనుంది.


Next Story