18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక.. బీసీసీఐ క్లారిటీ

by Harish |   (  Updated:2025-01-12 13:39:25  IST  )

ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభ తేదీని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా రివీల్ చేశారు.

18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక.. బీసీసీఐ క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభ తేదీని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా రివీల్ చేశారు. ఆదివారం బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 23 నుంచి లీగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఐపీఎల్‌కు ఏడాది కాలానికి కొత్త కమిషనర్‌ను నియమిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఐపీఎల్ 18వ సీజన్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో లీగ్‌కు సంబంధించి ప్రారంభ, ముగింపు తేదీలను బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మార్చి 14న సీజన్ మొదలవుతుందని, మే 25న ఫైనల్ జరుగుతుందని పేర్కొన్నాయి. అయితే, తాజాగా శుక్లా చేసిన ప్రకటనను బట్టి టోర్నీ ప్రారంభాన్ని 9 రోజులు వెనక్కి జరిపినట్టు అర్థమవుతుంది. ఫ్రాంచైజీలు, అధికారులతో చర్చించిన తర్వాత టోర్నీని ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.


18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక

చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఎంపికపై కూడా రాజీవ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 18 లేదా 19న జట్టును ప్రకటిస్తామని తెలిపారు. అయితే, చాంపియన్స్ ట్రోఫీకి తాత్కాలిక జట్టును ప్రకటించడానికి ఐసీసీ పెట్టిన డెడ్ ‌లైన్ ఆదివారంతో ముగిసింది. దీంతో తమ జట్టును ప్రకటించడానికి ఐసీసీని బీసీసీఐ పొడిగింపు కోరినట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత తమ ఉత్తమమైన జట్టు ఎంపికకు సమయం కావాలని తెలియజేసినట్టు తెలిసింది.

Next Story