రచన, అశ్విని ‘పసిడి’ పట్టు.. అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు కైవసం

by Harish |

భారత యువ మహిళా రెజ్లర్లు రచన, అశ్విని విష్ణోయ్ అండర్-17 వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు.

రచన, అశ్విని ‘పసిడి’ పట్టు.. అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత యువ మహిళా రెజ్లర్లు రచన, అశ్విని విష్ణోయ్ అండర్-17 వరల్డ్ చాంపియన్లుగా అవతరించారు. గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరుగుతున్న అండర్-17 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 43 కేజీల కేటగిరీలో రచన, 65 కేజీల కేటగిరీలో అశ్విని స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. గురువారం జరిగిన 43 కేజీల ఫైనల్‌లో రచన 3-0 తేడాతో చైనా రెజ్లర్ జిన్ హువాంగ్‌ను మట్టికరిపించింది. 65 కేజీల ఫైనల్‌లో అశ్విని కూడా అంతే తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ముఖయ్యో రఖిమోన్జోవా‌ను చిత్తు చేసింది. మరో రెండు గోల్డ్ మెడల్స్ కూడా భారత్ తృటిలో కోల్పోయింది. 57 కేజీల కేటగిరీలో మోని, 73 కేజీల కేటగిరీలో కాజల్ ఫైనల్‌లో ఓడి రజత పతకాలతో సరిపెట్టారు. చైనాకు చెందిన వెంజిన్ క్యూ చేతిలో 8-5తో కాజల్ ఓడగా.. ఉస్మానోవా(కజకస్థాన్) చేతిలో 6-5తో మోని పరాజయం పాలైంది. 49 కేజీల కేటగిరీలో కోమల్ వర్మ బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో గెలిచి కాంస్య పతకం సాధించింది. దీంతో గురువారం ఒకే రోజు భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యంతో మొత్తం ఐదు పతకాలు చేరాయి.

Next Story