రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-06 09:41:45  IST  )

ఇండియన్ క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత క్రికెట్‌కు అత్యద్భుతమైన సేవలు అందించిన లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తన అంతర్జాతీయ, దేశీయ, లీగ్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికారు.

రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్‌
X

దిశ, వెబ్ డెస్క్: భారత క్రికెట్‌కు అత్యద్భుతమైన సేవలు అందించిన లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా తన అంతర్జాతీయ, దేశీయ, లీగ్ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికారు. 36 ఏళ్ల ఈ అనుభవజ్ఞుడైన బౌలర్ సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచిన భారత జట్లలో చావ్లా సభ్యుడిగా ఉన్నాడు. 2006లో ఇంగ్లండ్‌తో తన అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించిన చావ్లా, 2012లో చివరిసారిగా భారత జెర్సీ ధరించారు. ఇండియా తరఫున 3 టెస్టులు, 25 వన్డేలు, 7 టీ20లు ఆడిన ఆయన, తన గూగ్లీ, లూపింగ్ లెగ్‌బ్రేక్‌లతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.

చావ్లా తన ఐపీఎల్ కెరీర్‌లోనూ ఘనంగా రాణించాడు. పంజాబ్ కింగ్స్, కొలకతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ వంటి ప్రాంఛైజీల తరఫున ఐపీఎల్‌లో ఆడి 192 వికెట్లు తీశాడు. 2014లో కోల్‌కతా తరఫున టైటిల్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లలో ఒకరిగా చావ్లా పేరు నిలిచింది. ఆటకు వీడ్కోలు చెప్పిన సందర్భంగా ఆయన తన కుటుంబానికి, అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈయన క్రికెట్‌పై ఉత్సాహం, నిరంతరంగా మెరుగయ్యే తపన ఎన్నో యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలుస్తుందని అభిమానులు సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.

Next Story