Hockey World Cup Qualifiers :సెమీస్‌లో ఇటలీపై విక్టరీ.. హాకీ వరల్డ్ కప్‌కు భారత్ అర్హత

by Harish |

Hockey World Cup Qualifiers :సెమీస్‌లో ఇటలీపై విక్టరీ.. హాకీ వరల్డ్ కప్‌కు భారత్ అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది జరగబోయే మహిళల హాకీ వరల్డ్ కప్‌‌కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచకప్ బెర్త్ కన్ఫార్మ్ అయ్యింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సెమీస్‌లో భారత్ 1-0 తేడాతో ఇటలీపై విజయం సాధించింది. మనీషా చాహౌన్ ఏకైక గోల్ చేసి భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆరంభం నుంచి మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు అద్భుతమైన డిఫెన్స్ ప్రదర్శించాయి. ఈ క్రమంలోనే భారత్‌కు గోల్ చేయడానికి పలు అవకాశాలు వచ్చాయి. 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ దక్కగా నవ్‌నీత్ కౌర్ ప్రయత్నాన్ని ఇటలీ గోల్ కీపర్ అడ్డుకుంది. 27వ నిమిషంలో మరో పెనాల్టీ కార్నర్ చాన్స్ వచ్చినప్పటికీ అది వృథానే అయ్యింది. మరో అవకాశాన్ని కూడా నవ్‌నీత్ విజయవంతంగా గోల్ చేయలేకపోయింది.

మరోవైపు, భారత గోల్‌కీపర్ బిచు దేవి కూడా ఇటలీ ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఇక, 40వ నిమిషంలో మనీషా గోల్ నిరీక్షణకు తెరదించింది. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మల్చడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా మరో రెండు పెనాల్టీ కార్నర్లు దక్కినా గోల్ చేయలేకపోయింది భారత్. అదే సమయంలో కట్టుదిట్టమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థిని నిలువరించింది. మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా ఇటలీకి పెనాల్టీ కార్నర్ దక్కింది. దీంతో ఆ జట్టు స్కోరును సమం చేస్తుందోమోనని అంతా టెన్షన్ అలుముకుంది. కానీ, భారత్ ప్రత్యర్థి ఆశలు నీళ్లు చల్లింది. గోల్‌ను అడ్డుకోవడంతో 1-0తో విజయం లాంఛనం చేసుకుంది. శనివారం జరిగే ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది.


Next Story