సొంతగడ్డపై టైటిల్ కొట్టేలా.. హాకీ ఆసియా కప్‌కు బలమైన జట్టును ప్రకటించిన హాకీ ఇండియా

by Harish |

త్వరలో ప్రారంభంకానున్న పురుషుల ఆసియా కప్‌కు భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్ : బిహార్ వేదికగా త్వరలో ప్రారంభంకానున్న పురుషుల ఆసియా కప్‌కు భారత హాకీ జట్టును హాకీ ఇండియా బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. మొత్తం 18 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆసియా కప్ జరగనుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఈ నెల 29న చైనాతో తలపడనుంది. ఆ తర్వాత 31న జపాన్‌తో, సెప్టెంబర్ 1న కజకస్థాన్‌లను ఎదుర్కోనుంది. వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ కప్‌‌కు ఈ టోర్నీ క్వాలిఫయర్. ఆసియా కప్ గెలవడం భారత్‌కు చాలా కీలకం. కాబట్టి, ఈ టోర్నీకి హాకీ ఇండియా బలమైన జట్టును ఎంపిక చేసింది. మిడిఫీల్డ్, డిఫెన్స్, ఎటాక్ ఇలా అన్ని విభాగాల్లో సమతుల్యతను పాటించింది. అనుభవజ్ఞుల వైపు మొగ్గు చూపింది. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత జట్టులో ఉన్న జర్మన్‌ప్రీత్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, మన్‌దీప్ సింగ్, వివేక్ సాగ్ ప్రసాద్, రాజ్ కుమార్ పాల్, సుమిత్, అమిత్ రోహిదాస్ వంటి ప్లేయర్లు ఆసియా కప్‌కు ఎంపిక చేశారు. అయితే, మిడిఫీల్డర్ షంషేర్ సింగ్‌‌కు చోటు దక్కలేదు. వెన్ను గాయంతో రిహాబిలిటేషన్‌లో ఉన్న గుర్జాంత్ సింగ్ కూడా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఆసియా కప్‌లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు 8సార్లు ఫైనల్‌కు చేరుకుంది. అందులో మూడుసార్లు(2003, 2007, 2017) టైటిల్ సాధించింది. 2022లో జరిగిన గత ఎడిషన్‌లో మూడో స్థానంలో నిలిచింది. చివరిసారిగా 2017లో విజేతగా నిలువగా 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తున్నది.

భారత హాకీ జట్టు

గోల్‌ కీపర్స్ : క్రిషన్ బి పాఠక్, సురాజ్ కర్కెరా, డిఫెండర్స్ సుమిత్, జర్మన్‌ప్రీత్ సింగ్, సంజయ్, హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్‌రాజ్ సింగ్, మిడ్‌ఫీల్డర్స్ : రాజిందర్ సింగ్, రాజ్ కుమార్ పాల్, హార్దిక్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఫార్వార్డ్స్ : మన్‌దీప్ సింగ్, షిలానంద్ లక్రా, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్.

రిజర్వ్ ప్లేయర్లు : నీలమ్ సంజీప్, సెల్వమ్ కార్తి


Next Story