బుమ్రాకు రెస్ట్!.. రాహుల్ ఎంట్రీ?

by Dishanational3 |
బుమ్రాకు రెస్ట్!.. రాహుల్ ఎంట్రీ?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్ ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్నది. వరుసగా రెండు విజయాలు టీమ్ ఇండియా జోరు మీద ఉన్నది. ముఖ్యంగా రాజ్‌కోట్‌లో గెలుపు భారత ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచేదే. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి స్టార్లు దూరంగా ఉన్న ఈ మ్యాచ్‌లో యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు అండగా నిలిచిన తీరు అభినందనీయం. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో ఫామ్ అందుకోవడం, సిరాజ్, జడేజా ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తించడం.. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మిగతా రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు నుంచి అభిమానులు ఇదే తరహా ప్రదర్శనను ఆశిస్తున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు నాలుగో టెస్టుకు రాంచీ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

పనిభారంలో భాగంగా..

రాంచీ టెస్టుకు జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మూడో టెస్టుకే అతనికి రెస్ట్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, రాజ్‌కోట్ టెస్టుకు అతను అందుబాటులో ఉన్నాడు. అయితే, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంగళవారం భారత ఆటగాళ్లు రాంచీకి బయల్దేరుతుండగా.. బుమ్రా జట్టుతో కలిసి వెళ్లడం లేదని సమాచారం. అతను అహ్మదాబాద్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బుమ్రా ఐదో టెస్టుకు అందుబాటులో ఉండటం కూడా నాలుగో టెస్టు ఫలితంపైనా ఆధారపడి ఉన్నది. రాంచీలోనే సిరీస్ దక్కితే ఐదో టెస్టు కూడా బుమ్రా దూరంగా ఉండేందుకే అవకాశాలు ఎక్కువ. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిస్తే.. ముకేశ్ కుమార్ లేదా ఆకాశ్ దీప్ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సిరీస్‌లో బుమ్రా 17 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. బుమ్రా దూరమైతే సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు.

రాహుల్ తిరిగొస్తున్నాడు!

తొలి టెస్టులో తొండకండరాల గాయంతో బాధపడిన కేఎల్ రాహుల్ వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మూడో టెస్టుకు అందబాటులో ఉంటాడని వార్తలు వచ్చినా.. ఆఖరి నిమిషంలో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించని కారణంగా అతను దూరమయ్యాడు. అయితే, రాంచీ టెస్టుకు అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘రాహుల్ మ్యాచ్ ఫిట్‌నెస్‌ను చేరుకున్నాడు. రాంచీ టెస్టుకు అందుబాటులో ఉంటాడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రాహుల్ జట్టులోకి వస్తే రజత్ పాటిదార్‌కు చోటు గల్లంతయ్యే అవకాశం ఉంది. రాహుల్ గైర్హాజరులో గత రెండు టెస్టుల్లో వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను 46 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ రాకతో టీమ్ ఇండియా మిడిలార్డర్ బలంగా మారుతుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ టెస్టులో అతను 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed