భారత్-పాక్ క్రికెట్‌పై ఐసీసీలో చర్చ?.. జై షా నేతృత్వంలో మీటింగ్!

by Phanindra |   (  Updated:2025-05-20 16:00:55  IST  )

భారత్-పాక్ క్రికెట్‌పై ఐసీసీలో చర్చ జరగనుంది. కొత్త చీఫ్ జై షా నేతృత్వంలో సింగపూర్ వేదికగా ఈ మీటింగ్ జరగబోతోంది.

భారత్-పాక్ క్రికెట్‌పై ఐసీసీలో చర్చ?.. జై షా నేతృత్వంలో మీటింగ్!
X

దిశ, స్పోర్ట్స్: భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై చర్చించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం జరగనుంది. కొత్తగా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జై షా ఆధ్వర్యంలో జులై 17 నుంచి 20 వరకు సింగపూర్ వేదికగా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరపున్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకూడదని బీసీసీఐ అనుకుంటోందని, ఈ క్రమంలోనే ఆసియా కప్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై ఐసీసీ చర్చిస్తుందని సమాచారం.

మిగతా ఎజెండా ఇదే..

దీంతోపాటు వన్డే క్రికెట్‌లో రెండు బంతులు ఉపయోగించడంపై కూడా ఐసీసీ చర్చించనుందట. వన్డేల్లో 25వ ఓవర్ తర్వాత కొత్త బంతిని తీసుకునే ఆప్షన్ ఇవ్వాలనే ప్రతిపాదనపై ఐసీసీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే అండర్-19 వరల్డ్ కప్‌ను కూడా టీ20 ఫార్మాట్‌కు మార్చాలని భావిస్తోంది. మహిళల అండర్-19 వరల్డ్ కప్ పొట్టి ఫార్మాట్లోనే జరుగుతుండగా.. పురుషుల వరల్డ్ కప్ మాత్రం వన్డే ఫార్మాట్‌లో జరుగుతోంది. దీన్ని కూడా మార్చేయాలని ఐసీసీ భావిస్తోంది.

అలాగే టెస్టుల్లో కూడా ఓవర్ల మధ్య 60 సెకన్ల కాలపరిమితిని పెట్టాలని, తద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆటలో ఆలస్యం జరగదని నిపుణులు అంటున్నారు. అలాగే అసోసియేట్ దేశాల నుంచి ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీకి వచ్చే ముగ్గురు ప్రతినిధుల ఎన్నికలు కూడా ఇదే సమావేశంలో నిర్వహించనున్నారు. మొత్తం 45 అసోసియేట్ సభ్యులు తమ ప్రతినిధులుగా ముగ్గుర్ని ఎంపిక చేసుకుంటారు. వీళ్లు రెండేళ్లపాటు ఐసీసీలో ఉంటారు.

Next Story