నాకు ఎవరో విషం ఇచ్చారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు

by Disha Web Desk 13 |
నాకు ఎవరో విషం ఇచ్చారు.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: తనకు ఎవరో విషం ఇచ్చారని, దీని కారణంగా తన శరీరంలో జాయింట్లు మొత్తం దెబ్బతిన్నాయని, చికిత్స కోసమే తాను పాక్ కరెన్సీలో 12 నుంచి 15 కోట్లు ఖర్చు చేసినట్లు పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ సంచలన విషయాలు వెల్లడించాడు.

"ఈ మధ్యే నాకు చికిత్స జరిగినప్పుడు.. ఎమ్‌ఆర్‌ఐ స్కాన్స్ తీశారు. అందులో నాకు ఎవరో మెర్క్యూరీ అనే పాయిజన్ ఇచ్చినట్లు తేలిందని.. ఇదొక స్లో పాయిజన్. ఇది మెల్లగా జాయింట్స్‌లోకి వెళ్లి వాటిని నాశనం చేస్తుంది. గత 8 నుంచి 10 ఏళ్లలో వీటికి చికిత్స చేయించుకున్నాను. ఈ కారణం వల్లే నేను ఆరేడేళ్లు తీవ్రంగా బాధపడ్డాను. నా జాయింట్లన్నీ దెబ్బ తిన్నాయి. కానీ అలాంటి పరిస్థితి నుంచి కూడా నేను పూర్తిగా బెడ్ కే పరిమితం కాకుండా బయటపడ్డాను" అని నజీర్ చెప్పాడు.

అయితే ఈ కష్టకాలంలో మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తనకు సాయం చేశాడని.. 50 లక్షల వరకూ ఇచ్చినట్లు నజీర్ వెల్లడించాడు. అయితే తనకు విషం ఎవరు ఇచ్చారన్న విషయం మాత్రం తెలియదన్నాడు. నజీర్ 1999 నుంచి 2012 మధ్య పాక్ తరఫున 8 టెస్టులు, 79 వన్డేలు ఆడాడు.


Next Story