త్రిష ఆట మరింత మందికి స్పూర్తి

by Ajay Maddhiboyina |

త్వరలోనే హెచ్‌సీఏ తరపున ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బందిని సత్కరిస్తామని చెప్పారు.

త్రిష ఆట మరింత మందికి స్పూర్తి
X

- త్వరలోనే ఘనంగా సత్కరిస్తాం

- హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు

దిశ, స్పోర్స్: టీమ్ ఇండియా అండర్‌-19 టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంలో కీలక భూమిక పోషించిన తెలంగాణ క్రికెటర్ గొంగిడి త్రిష మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. ఆమెతో పాటు మరో క్రికెటర్ కేసరి ధృతి, జాతీయ జట్టు హెడ్ కోచ్ నోషిన్ ఎ ఖదీర్, ట్రైనర్ షాలిని మలేషియా నుంచి శంషాబాద్ ఎయర్‌పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు వీరందరికీ ఎయిర్‌పోర్టులో సాదర స్వాగతం పలికారు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషతో పాటు మిగిలిన సభ్యులకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ ఇది అద్భుతమైన, స్పూర్తిదాయకమైన విజయం అన్నారు. త్రిష సక్సెస్ స్టోరీ క్రికెట్‌‌తో పాటు ఇతర క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవాలని భావిస్తున్న ఎంతో మంది అమ్మాయిలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. ఆమె ఎంతో నిబద్దతతో టోర్నీలో ఆడిందని జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన భారత అండర్-19 మహిళల జట్టుకు హైదరాబాద్‌కు చెందిన నోషిన్ హెడ్ కోచ్‌గా ఉండటం గర్వకారణమని చెప్పారు. త్వరలోనే హెచ్‌సీఏ తరపున ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆటగాళ్లతో పాటు, సహాయక సిబ్బందిని సత్కరిస్తామని చెప్పారు.

దేశానికి మరింత కీర్తిని తెస్తా : గొంగడి త్రిషా

టీ20 అండర్-19 జట్టులో భాగస్వామ్యం కావడం చాలా గర్వకారణం. జట్టు విజయాల్లో నేను కీలక పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. ఇలాగే నా ఆటను కొనసాగించి దేశానికి మరింత కీర్తిని తీసుకొస్తాను. జాతీయ జట్టు సహాయక సిబ్బందితో పాటు నాకు మార్గదర్శులుగా నిలిచిన జాన్ మనోజ్, అనూప్ పాయ్, శ్రీనివాస్‌లతో పాటు సెయింట్ జాన్స్ కోచింగ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

Next Story