హనుమ విహారి సంచలనం నిర్ణయం

by Dishanational3 |
హనుమ విహారి సంచలనం నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా తప్పుకున్నాడు. రంజీ ట్రోఫీలో శుక్రవారం ముంబైతో మ్యాచ్‌కు ముందు విహారి కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. బ్యాటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడానికే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విహారి తప్పుకోవడంతో సీనియర్ బ్యాటర్ రికీ భుయ్ రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు పగ్గాలు అందుకున్నాడు. ఆంధ్ర తరఫున విహారి 30 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా రాణించాడు. 53 సగటుతో 2,262 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన టాప్-10 ఆంధ్ర బ్యాటర్లలో విహారి ఒకడు. మరోవైపు, విహారిని కావాలనే తప్పించారని వార్తలు వస్తున్నాయి. వీటిపై చీఫ్ సెలెక్టర్ ఆర్‌వీసీహెచ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టేందుకు విహారి కాస్త విరామం తీసుకోవాలనుకున్నాడు. అతన్ని తప్పించాలని ఎలాంటి ఒత్తిడి లేదు.’ అని చెప్పారు. కాగా, 2018లో హనుమ విహారి భారత టెస్టు జట్టులోకి అరంగేట్రం చేశాడు. జట్టులో తీవ్ర పోటీ కారణంగా అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఇప్పటివరకు 16 టెస్టులు ఆడిన అతను 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు. చివరిసారిగా 2022లో ఇంగ్లాండ్‌పై టెస్టు మ్యాచ్ ఆడాడు.


Next Story

Most Viewed