కొలకతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్

by Malleboina Mahesh |

ఐపీఎల్ 2025 లో నామమాత్రపు ఫామ్ కనబరిచిన కేకేఆర్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కొలకతా నైట్‌రైడర్స్‌ హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 లో నామమాత్రపు ఫామ్ కనబరిచిన కేకేఆర్ (KKR) జట్టులో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత మూడు సీజన్లుగా కేకేఆర్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన చంద్రకాంత్ పండిట్ (Chandrakant Pandit) స్థానంలో ఇప్పుడు మాజీ భారత క్రికెటర్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) కొత్త హెడ్ కోచ్‌గా నియమితులయ్యారు. పండిట్‌ నాయకత్వంలో కేకేఆర్‌ 2024లో ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే పండిట్‌-ఫ్రాంచైజీ మధ్య సంబంధాలు తెగిపోయాయి. అనంతరం కేకేఆర్‌ యాజమాన్యం కొత్త కోచ్ కోసం శోధన ప్రారంభించగా, ఆటపై లోతైన అవగాహన, ఆటగాళ్లతో సాన్నిహిత్యం, ప్రొఫెషనల్‌ కోచింగ్‌ పద్ధతులు ఉన్న నాయర్‌ను ఎంపిక చేసింది.

కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్ (Venky Mysore) మాట్లాడుతూ.. “2018 నుండి మా సెటప్‌లో కీలక భాగమైన అభిషేక్‌ ఇప్పుడు హెడ్ కోచ్‌ (Head coach)గా బాధ్యతలు స్వీకరించడం మాకు గర్వకారణం. ఆయన ప్రణాళికలు, ప్లేయర్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టి కేకేఆర్‌ను మరింత బలపరుస్తుంది” అని అన్నారు. 42 ఏళ్ల నాయర్ ఆటగాళ్ల మానసిక, శారీరక అభివృద్ధిపై ఆధునిక దృష్టికోణంతో ప్రసిద్ధి చెందారు. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ల వంటి పలువురు భారత ఆటగాళ్లు అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో తమ ఆటతీరును కొత్త స్థాయికి చేర్చుకున్నారు.

కేకేఆర్‌ సపోర్ట్‌ స్టాఫ్‌లో 2018 నుండి కొనసాగుతున్న ఆయన, గత సంవత్సరం భారత జట్టుతో అసిస్టెంట్‌ కోచ్‌గా కూడా సేవలందించారు. రాబోయే సీజన్‌లో నాయర్ మెంటర్‌ డ్వేన్ బ్రావోతో కలిసి జట్టును నడిపించనున్నారు. ఈ క్రమంలో మాజీ బౌలింగ్ కోచ్‌ భరత్ అరుణ్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో కొత్త బాధ్యతలు స్వీకరించగా, ఆయన స్థానంలో కొత్త కోచ్ నియామక ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త దశలో కేకేఆర్‌ నాయకత్వం, వ్యూహం, ప్రదర్శనలో అభిషేక్ నాయర్ కీలక పాత్ర పోషించనున్నారు.

Next Story