గేల్ తిరిగొస్తున్నాడు.. తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్ అతనే

by Dishanational3 |
గేల్ తిరిగొస్తున్నాడు.. తెలంగాణ టైగర్స్‌కు కెప్టెన్ అతనే
X

దిశ, స్పోర్ట్స్ : యూనివర్సల్ బాస్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డుల బద్దలుకొట్టిన వెస్టిండీస్ మాజీ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ తిరిగొస్తున్నాడు. మళ్లీ బ్యాటు పట్టబోతున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఐపీఎల్ తరహాలో ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్(ఐవీపీఎల్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, ఎస్.శ్రీశాంత్‌, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ ఈ టోర్నీ ద్వారా తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. వీరితోపాటు విదేశీ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీలో భాగమవుతున్నారు. తాజాగా గేల్ సైతం ఈ జాబితాలో చేరాడు.

ప్రారంభ ఐవీపీఎల్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. అందులో గేల్ తెలంగాణ టైగర్స్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అంతేకాకుండా, టోర్నీలో జట్టుకు అతనే నడిపించనున్నట్టు తెలుస్తోంది. భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగి, గోని మన్‌ప్రీత్‌తోపాటు వెస్టిండీస్ మాజీ బ్యాటర్ రికార్డో పావెల్‌తో కలిసి గేల్ తెలంగాణ టైగర్స్‌ జట్టులో భాగమయ్యాడు.

ఐవీపీఎల్ టోర్నీ ఆడటంపై గేల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వ్యాఖ్యానించాడు. ‘నాపై నాకు నమ్మకం, అభిమానుల కేరింతలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ యూనివర్స్ బాస్ తిరిగి వస్తున్నాడు. తొలి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్‌లో దిగ్గజ ఆటగాళ్లతో ఆడబోతున్నా. వీఐపీఎల్ కోసం సిద్ధంగా ఉండండి.’ అని గేల్ తెలిపాడు. కాగా, 44 ఏళ్ల గేల్ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. సొంత గడ్డ జమైకాలో ఆటకు వీడ్కోలు పలకాలని అతను భావిస్తున్నాడు. 2021లో ఆస్ట్రేలియాపై విండీస్‌ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఐపీఎల్‌లోనూ చివరిసారిగా కనిపించాడు. ఈ నెల 23 నుంచి మార్చి 3 వరకు ఐవీపీఎల్ టోర్నీ జరగనుంది.



Next Story

Most Viewed