గాయపడిన జడేజా.. రెండో టెస్టు ఆడటం డౌటే?

by Dishanational3 |
గాయపడిన జడేజా.. రెండో టెస్టు ఆడటం డౌటే?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయపడ్డాడు. ఆదివారం భారత రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతని కాలుకు గాయమైంది. జోరూట్ వేసిన 39వ ఓవర్‌లో జడేజా అనవసర పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. బెన్‌స్టోక్స్ మెరుపు వేగంతో రనౌట్ చేయడంతో జడేజా నిరాశగా మైదానం వీడాడు. అయితే, పరుగు కోసం వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. దీంతో అతను ఇబ్బంది పడుతూనే మైదానాన్ని వీడాడు. జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది. అయితే, మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ తాను ఇంకా ఫిజియోతో మాట్లాడలేదని తెలిపాడు. జడేజా గాయంపై టీమ్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

కాగా, తొలి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడేజా బంతితోపాటు బ్యాటుతోనూ మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగులతో అతను కీలక ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 20 బంతులు ఎదుర్కొన్న అతను 2 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అలాగే, ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు.


Next Story