బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డుతో ఐసీసీ చర్చలు.. మరో మెలిక పెట్టిన బంగ్లా

by Harish |

బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డుతో ఐసీసీ చర్చలు.. మరో మెలిక పెట్టిన బంగ్లా
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) రోజుకో మెలిక పెడుతోంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బీసీబీ అభ్యర్థించగా ఐసీసీ తిరస్కరించింది. శనివారం ఢాకాలో బీసీబీతో ఐసీసీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ మీటింగ్‌లో బంగ్లా టీమ్‌ను భారత్‌కు పంపమని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే, బీసీబీ మరో ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. తమ జట్టును వేరే గ్రూపులోకి చేర్చాలని ఐసీసీని కోరింది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లా టీమ్ గ్రూపు సిలో ఉంది. గ్రూపు బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ జట్టును స్వాప్ చేయాలని కోరినట్టు సమాచారం. ఐర్లాండ్‌ను గ్రూపు సిలోకి, బంగ్లాను గ్రూపు బిలో చేర్చాలన్నది బీసీబీ ప్రతిపాదన. గ్రూపు బి మ్యాచ్‌‌లు శ్రీలంకలో జరగనున్నాయి. గ్రూపు బిలోకి వెళ్లడం ద్వారా తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడొచ్చనేది బీసీబీ ఉద్దేశం. మరి, ఈ ప్రతిపాదనకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఐర్లాండ్ కూడా ఇందుకు అంగీకరించాల్సి ఉంటుంది.


Next Story