హిస్టరీ క్రియేట్ చేసిన భారత బ్యాడ్మింటన్ జోడీ.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం

by Disha Web Desk 13 |
హిస్టరీ క్రియేట్ చేసిన భారత బ్యాడ్మింటన్ జోడీ.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ షెట్టి స్వర్ణం సాధించారు. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత్‌కు టైటిల్‌ అందించారు. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఇప్పటి వరకు స్వర్ణ పతకం లేదు. ఆదివారం నాడు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో మలేసియాకు చెందిన ఎనిమిదో సీడ్‌ జోడీ ఆంగ్‌ యు సిన్‌ - టియోను 16-21, 21-17, 21-19తో చిత్తుగా సాత్విక్‌ - చిరాగ్‌ జోడీ మట్టికరిపించింది.

ఈ క్రమంలోనే 58 ఏళ్ల తర్వాత ఈ టోర్నమెంట్‌లో భారత్‌ తొలి పసిడి పతకం ముద్దాడింది. 1965లో పురుషుల సింగిల్స్‌లో దినేశ్‌ ఖన్నా విజేతగా నిలిచి భారత్‌కు తొలిసారి పసిడి పతకం అందించాడు. 58 ఏళ్ల తర్వాత మళ్లీ సాత్విక్‌ సాయిరాజ్‌ - చిరాగ్‌ షెట్టి జోడీ భారత్‌ పసిడి లోటు తీర్చింది. 1971లో దీపూ ఘోష్‌–రమణ్‌ ఘోష్‌ ద్వయం భారత్‌కు కాంస్య పతకం వచ్చింది.

ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనలతో ఫైనల్ చేరిన సాత్విక్ - చిరాగ్ జోడీ.. తొలి గేమ్‌ కోల్పోయింది. ఒకానొక దశలో రెండో గేమ్‌లో 7-13, మూడో గేమ్‌లో 11-15తో కూడా వెనుకబడ్డారు. కానీ చివర్లో అనూహ్యంగా పుంజుకొని రెండు సెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సీజన్‌లో వీళ్లిద్దరికీ ఇది రెండో టైటిల్‌. గత మార్చిలో స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300లో కూడా వీళ్లు టైటిల్‌ దక్కించుకున్నారు.


Next Story