ఆసియా బ్యాడ్మింటన్‌లో సింధుకు షాక్.. రెండో రౌండ్‌లోనే ఔట్

by Harish |

ఆసియా బ్యాడ్మింటన్‌లో సింధుకు షాక్.. రెండో రౌండ్‌లోనే ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సింధు 18-21, 8-21 తేడాతో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో ఓడిపోయింది. 46 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు ప్రత్యర్థికి గట్టి పోటీనివ్వలేకపోయింది. తొలి గేములో పోరాడినా చైనా ప్లేయర్‌ను నిలువరించలేకపోయింది. ఇక రెండో గేములో పూర్తిగా తేలిపోయి ఓటమిని అంగీకరించింది. ఇప్పటికే లక్ష్యసేన్ ఇంటిదారిపట్టగా.. పతకం తెస్తుందనుకున్న సింధు కూడా నిరాశపర్చింది. యువ క్రీడాకారిణి ఉన్నతి హుడా కూడా రెండో రౌండ్‌లో ఇంటిదారిపట్టింది. జపాన్‌కు చెందిన మియాజకీ చేతిలో 21-17, 21-9 తేడాతో ఓడిపోయింది.

పతక ఆశలు రేపుతున్న ఆయుశ్

స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్‌లో తన ప్రయాణాన్ని ముగించాడు. చైనాకు చెందిన వెంగ్‌తో తలపడిన అతను 21-12, 21-19తో ఓటమిపాలయ్యాడు. లక్ష్యసేన్, సింధు, ప్రణయ్, శ్రీకాంత్ నిరాశపర్చిన వేళ యువ ప్లేయర్ ఆయుశ్ శెట్టి పతక ఆశలు రేపుతున్నాడు. ఈ యువ ప్లేయర్ తొలి రౌండ్‌లో వరల్డ్ నం.7 ఆటగాడికి షాకిచ్చిన విషయం తెలిసిందే. టోర్నీలో అతను మరో విజయం నమోదు చేశాడు. రెండో రౌండ్‌లో ఆయుశ్ 21-16, 21-12 తేడాతో చైనీస్ తైపీ ఆటగాడు చి యు జెన్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ప్రస్తుతం టోర్నీలో భారత్ తరపున మిగిలిన ఏకైక ప్లేయర్ అతనే.

Next Story