టీ20 జట్టు నుంచి రిజ్వాన్, అజామ్ ఔట్

by Ajay Maddhiboyina |

మహ్మద్ రిజ్వాన్‌ను వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. అయితే సయిమ్ అయూబ్‌ను రెండు జట్ల నుంచి తప్పించింది.

టీ20 జట్టు నుంచి రిజ్వాన్, అజామ్ ఔట్
X

- పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా

- జట్టులోకి తిరిగొచ్చిన షాదాబ్ ఖాన్

- మార్చి 16 నుంచి న్యూజీలాండ్ పర్యటన

దిశ, స్పోర్ట్స్: చాంపియన్స్ ట్రోఫీలో దారుణ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మార్పులు చేశారు. మార్చి 16 నుంచి పాకిస్తాన్ జట్టు న్యూజీలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఐదు టీ20 మ్యాచ్‌లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. కాగా, పాకిస్తాన్ టీ20 జట్టు నుంచి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌లను తప్పించింది. సల్మాన్ అలీ అఘాను టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. ఇక షాదాబ్ ఖాన్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. వెస్టిండీస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి షాదాబ్ టీ20లు ఆడటం లేదు. అయితే అతడిని జట్టులోకి తిరిగి చేర్చడమే కాకుండా, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సల్మాన్ అలీ అఘా, షాదాబ్‌లను రాబోయే మేజర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకొని టీ20 జట్టు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఏడాదిలోనే ఆసియా టీ20 కప్‌తో పాటు వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కూడా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ పేర్కొంది. పాక్ జట్టులో కొత్తగా అబ్దుల్ సమద్, హసన్ నవాజ్, మహమ్మద్ అలీలకు చోటు కల్పించింది. ఈ ముగ్గురు ఇంత వరకు పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడలేదు.

మరోవైపు మహ్మద్ రిజ్వాన్‌ను వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. అయితే సయిమ్ అయూబ్‌ను రెండు జట్ల నుంచి తప్పించింది. సౌతాఫ్రికా పర్యటనలో కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ఆడుతుండగా అయూబ్ కుడి మడమకు గాయం అయ్యింది. ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో న్యూజీలాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. న్యూజీలాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టు క్రైస్ట్ చర్చ్, డునేదిన్, అక్లాండ్, మౌంట్ మాంగన్వీ, వెల్లింగ్టన్‌లో టీ20 మ్యాచ్‌లు.. నేపియర్, హామిల్టన్, మైంట్ మాంగన్వీలో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

Next Story