ఆసియా బాక్సింగ్‌లో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగు పతకాలతో సంచలనం

by Harish |

ఆసియా బాక్సింగ్‌లో అదరగొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగు పతకాలతో సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా బాక్సర్లు అదరగొట్టారు. మంగోలియాలో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు కొల్లగొట్టారు. మీనాక్షి హుడా(48 కేజీలు), ప్రీతి పవార్(54 కేజీలు), ప్రియా(60 కేజీలు), అరుంధతి చౌదరి(70 కేజీలు) తమ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఆసియా చాంపియన్‌లుగా అవతరించారు. గురువారం భారత బాక్సర్లు ఆరు ఫైనల్స్‌లో పోటీపడ్డారు. 48 కేజీల కేటగిరీలో ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌ అయిన మీనాక్షి ఫైనల్‌లో 5-0 తేడాతో మంగోలియా బాక్సర్ నోముండారి ఎంఖ్-అమ్గలన్‌పై ఏకపక్ష విజయం సాధించింది. 54 కేజీల కేటగిరీలో ప్రీతి ఫైనల్‌లో సంచలన ప్రదర్శన చేసింది. మూడుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన హువాంగ్ హ్సియావో వెన్(చైనీస్ తైపీ)ని 5-0 తేడాతో ఓడించింది. ఇక, 60 కేజీల ఫైనల్‌లో ప్రియా 3-0తో వోన్ ఉన్ గ్యోంగ్(నార్త్ కొరియా)పై నెగ్గగా.. 70 కేజీల ఫైనల్‌లో అరుంధతి 4-1తో బకిత్ సెయిడిషన్(కజకస్థాన్)పై గెలుపొందింది. జైస్మిన్ లంబోరియా(57 కేజీలు), అల్ఫియా పఠాన్(80+ కేజీలు) ఫైనల్‌లో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టారు. మొత్తంగా మహిళా బాక్సర్లు నాలుగు స్వర్ణాలు సహా మొత్తం 10 పతకాలు మహిళా బాక్సర్లు గెలవడం విశేషం. నిఖత్ జరీన్(51 కేజీలు), లవ్లీనా బోర్గోహైన్(75 కేజీలు), పూజ రాణి(80 కేజీలు), అంకుషిత బోరో(65 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.శుక్రవారం పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేశ్(50 కేజీలు), సచిన్ సివాచ్(60 కేజీలు) ఫైనల్స్‌ ఆడనున్నారు.


Next Story