రికార్డులు బద్దలుకొట్టిన స్పిన్నర్ అశ్విన్

by  |
రికార్డులు బద్దలుకొట్టిన స్పిన్నర్ అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో బ్యాట్, బాల్‌తో రాణించిన అశ్విన్.. తన ఫామ్‌ను స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా కొనసాగించాడు. అహ్మదాబాద్‌లో జరిగిన 4వ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి మరోసారి అందరినీ ఆకర్షించాడు.

ఈ సిరీస్‌లో అశ్విన్ మొత్తం 32 వికెట్లు తీయడమే కాకుండా ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. అంతేగాకుండా ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ సరసన అశ్విన్ నిలిచాడు. అశ్విన్ ఒక సిరీస్‌లో 30పైగా వికెట్లు తీయడం ఇది రెండో సారి. 2015లో దక్షిణాఫ్రికాపై 31 వికెట్లు తీశాడు. అందులో ఒక మ్యాచ్‌లో 12/98 ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రెండు సిరీస్‌లలో 30 పైగా వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించాడు. కపిల్ దేవ్ 1979/80లో పాకిస్తాన్‌పై ఆరు టెస్టుల సిరీస్‌లో 32 వికెట్లు తీశాడు. ఇక హర్బజన్ 2001లో ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు టెస్టుల్లోనే 32 వికెట్లు తీశాడు.

ఇదే మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ వెస్టిండీస్ దిగ్గజం కర్ట్‌లీ ఆంబ్రోస్ (405 వికెట్లు) రికార్డును అధిగమించాడు. ఇక ఇంగ్లాండ్ జట్టుపై రవిచంద్రన్ అశ్విన్ మొత్తం 85 వికెట్లు తీసి కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ రికార్డును అధిగమించాడు. అశ్విన్ కంటే ముందు అనిల్ కుంబ్లే, బీఎస్ చంద్రశేఖర్ ఉన్నారు. ఇక అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోవడం ఇది 8వ సారి కావడం విశేషం.



Next Story