ఆగమాగం.. జగన్నాథం!

by  |
ఆగమాగం.. జగన్నాథం!
X

దిశ, న్యూస్ బ్యూరో: అది లేకుండా నేనుండలేను.. అది ఉంటేనే నేను ఆనందంగా ఉంటా.. అందుకే చెబుతున్నా.. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు.. నాకు ఖచ్చితంగా అది కావాల్సిందే అంటూ కొంతమంది ఆగమాగమైతున్నరు కొంతమంది. అదేంటో ఇప్పుడు చూడండి.. ప్రత్యేక కథనంలో..

దేశమంతా లాక్ డౌన్.. 24 గంటలూ ఇంట్లోనే ఉండాలి. టీవీలు, యూట్యూబ్ ఎంతసేపు చూస్తాం.. ఖాళీగా ఏముంటాం.. మాంసం దుకాణాలు కూడా తెరిచారు. స్టఫ్ దొరికింది కానీ.. చుక్కే లేదు. రేటు డబుల్ అయినా పర్వాలేదు కానీ బాటిల్ దిగాల్సిందే.. అంటూ ఫోన్లు మొత్తుకుంటున్నాయి. వైన్స్ దుకాణాలు కూడా మూసివేయడంతో మద్యం బ్లాక్ మార్కెట్లో ధరలు చుక్కలు అంటుకుంటున్నాయి. ఎంఆర్‌పీ కంటే రెండు, మూడు రెట్లు అధికంగా ఖర్చు చేసేందుకు కూడా మద్యం ప్రియులు వెనకాడటం లేదు.

మరోసారి నిరూపణ

మద్యానికి మన రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉందనేది కరోనా మరోసారి నిరూపిస్తుంది. ఒక్కో బీర్ బాటిల్ రూ. 500 వరకూ పలుకుతుండగా.. విస్కీ ధరలు బ్రాండ్ ను బట్టి నాలుగు రెట్లు కూడా చెల్లిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని ఓ వైన్స్‌లో అందులో పనిచేసే వర్కర్ మార్చి 26న అర్ధరాత్రి సమయంలో లిక్కర్ బాటిళ్లను ప్యాకింగ్ చేస్తున్నట్టు సీసీ కెమెరాల ద్వారా గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిని బ్లాక్ దందాలో అమ్ముకుని ఎక్కువ సంపాధించాలని నిందితుడు భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాగేందుకు సమయానికి మద్యం దొరకకపోవడంతో గురువారం రోజు కూకట్ పల్లిలో మరో వ్యక్తి గొంతు కోసుకుని చనిపోయాడు.

కల్లు కోసం మహిళల వీడియో వైరల్

మద్యం, కల్లు దుకాణాలు సైతం కరోనా దెబ్బకు మూతపడిపోయాయి. హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ కల్లు దుకాణాలు మూతపడ్డాయి. జిల్లా, డివిజన్ కేంద్రాల్లో రోజూవారీ, దినసరి, శారీరక శ్రమతో పనులు చేసే రిక్షావాలాలు, భవన నిర్మాణ రంగ కార్మికులు, హమాలీలు, వీధుల్లో తిరిగి వస్తువులు అమ్ముకునే, కొనుక్కునే వాళ్లకు, సాయంత్రం పూట చీఫ్ లిక్కర్ వేయాల్సిందే. కొన్ని చోట్ల పురుషులు, మహిళలు కూడా కల్లు దుకాణాలకు చేరుకుని అక్కడి నుంచే ఇంటికి వెళ్తుంటారు. ఇప్పుడు వారంతా ఏమీ చేయాలో తెలియక పిచ్చివాళ్లుగా మారిపోతున్నారు. కల్లు దొరకడం లేదంటూ మహిళలు కేసీఆర్‌ను అడుగుతున్న ఓ వీడీయో సోషల్ మీడీయాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ కల్లు దుకాణాలు బంద్ చేసిన సందర్భంలో చాలామంది పిచ్చివాళ్లుగా మారిపోయిన అనుభవం మనరాష్ట్రంలో ఉంది. కరోనా నివారణ కోసం మరోసారి కల్లు దుకాణాలు మూత పడి, ఇదే పరిస్థితి మరో మూడు నెలలు ఉంటుందనే ప్రచారం ఉండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

Tags : wine, ladies, social media, wine shop, shopkeepers, women, kookat palli, Brandy, Whiskey, Beers


Next Story