సాయం చేసే గుణమున్న అతిలోక సుందరీమణులు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్

by Gantepaka Srikanth |

హైదరాబాద్​మహానగరం విశ్వసుందరీ పోటీలతో కోలాహలంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 120 మందికి పైగా అందాల భామలు కిరీటాన్ని దక్కించుకునేందకు పోటీపడుతున్నారు.

సాయం చేసే గుణమున్న అతిలోక సుందరీమణులు.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్
X

హైదరాబాద్​మహానగరం విశ్వసుందరీ పోటీలతో కోలాహలంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 120 మందికి పైగా అందాల భామలు కిరీటాన్ని దక్కించుకునేందకు పోటీపడుతున్నారు. అందాల పోటీలు అనగానే.. అందం ఒకటే కాదు.. అభినయం.. ఆత్మవిశ్వాసం, ప్రతిభాపాఠవాలు.. సామాజిక దృక్పథం, సాయం చేసే గుణం ఉన్న అతిలోక సుందరీమణులెందరో ఈ వరల్డ్​బ్యూటీ కంటెస్ట్‌లో పాలుపంచుకుంటున్నారు. సంపన్న దేశాలే కాదు.. అత్యంత వెనుకబడిన పేద దేశాల నుంచి బ్యూటీస్ పాల్గొనడం ఒక ఎత్తయితే. ఇస్లామిక్​దేశమైన కిర్గిస్తాన్‌ నుంచి అందాల పోటీలకు పాలుపంచుకోవడం మరో విశేషం. అయితే, ఇందులో ఒక్కక్కరిది ఒక్కో నేపథ్యం.. మహిళల సాధికారత.. దివ్యాంగులకు చేయూత, రొమ్ము క్యాన్సర్‌, లైంగిక హింసకు గురైన బాలికల్లో ఆత్మవిశ్వాసం, సాంప్రదాయ పర్యావరణం వంటి సామాజిక కోణం కలిగిన సేవా కార్యక్రమాలతో లైఫ్ లీడ్​చేస్తున్నటువంటి పలు దేశాల మిస్​వరల్డ్​కంటెస్టెంట్స్ గురించిన విశేషాలు.. - పిల్లి రాజేందర్

నందిని గుప్తా.. ఇండియా

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో మన దేశం తరుపున పాల్గొంటున్న నందినీ గుప్తా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన నందినీది సాధారణ వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయదారుడు, అమ్మ గృహిణి. కోటాలోని సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదివిన ఆమె, ముంబైలోని లాలా లజపత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. 2023లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నది. ఇప్పుడు ఆమె 72వ మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీలో ఇండియా తరుపున పాల్గొంటున్నది. సమాజ సేవ చేయాలని చిన్నప్పటి నుంచే ఇష్టాన్ని పెంచుకోని ఏక్తా ఫౌండేషన్​స్థాపించి సమాజ సేవలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సందేశమిస్తున్నారు. ప్రత్యేక అవసరాల ఉన్న వారికి ఉపాధి నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళలకు సైతం ఉపాధి చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్నారులకు తనవంతుగా సహయం అందిస్తున్నారు. నందని యోగాసానాలు చేయడంలోనూ దిట్ట. యోగాతోనే ఒత్తిడిని జయించవచ్చన్నది నందిని అభిప్రాయం. మన దేశానికి పేరు తీసుకొచ్చే ఈ మహత్తర వేదికపై నందిని గుప్తా కీరిటాన్ని గెలుచుకోవాలని యావత్​భారత్​ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

చనాచెవ్​.. కిర్గిస్తాన్​

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో కిర్గిస్తాన్‌ దేశం నుంచి ఐజాన్‌ చనాచెవ్ పాలుపంచుకుంటున్నారు. 26 ఏళ్ల చనాచెవ్ 2019ల మిస్ కిర్గిస్తాన్​టైటిల్​గెలుచకున్నారు. దేశం తరఫున ‘మిస్‌ ఎర్త్‌’ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు. తొమ్మిది సార్లు వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. కిర్గిస్తాన్‌ ఇస్లామిక్‌ దేశం రష్యా, ఉక్రెయిన్‌లతో పాటు మొత్తం 15 దేశాల సమూహమైన ‘యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్స్‌’ (యుఎస్‌ఎస్‌ఆర్‌) నుంచి 1991లో విడిపోయిన కిర్గిస్తాన్‌ ఇండిపెండెంట్​ దేశంగా ఆవిర్భవించింది. నాలుగేళ్ల క్రితమే ఇక్కడ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ దేశంలో అందాల పోటీల నిర్వహణ 2011లో ప్రారంభమయ్యాయి. అత్యంత వెనుకబడిన ఈ దేశ జనాభాలో 90 శాతం ముస్లింలు ఉన్నప్పటికీ అందాల పోటీల్లో పాల్గొనడానికి ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం విశేషం. స్వదేశంలో ‘కిడ్నాప్‌ పెళ్లిళ్ల’కు వ్యతిరేకంగా, బాలికలు, మహిళల హక్కుల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి చనాచెవ్‌ పోరాడుతున్నారు. వివిధ సామాజిక కార్యకలాపాల ద్వారా దేశంలోని యువతుల సాధికారత కోసం చురుకుగా పాల్గొంటుంది. కిర్గిస్తాన్​సోషల్​ఎంటర్‌ప్రెన్యూర్స్​సంఘంతో యూస్ రాయబార కార్యాలయంలో బధిరుల కోసం ప్రభుత్వ శిబిరంలో పదేళ్లకు పైగా స్వచ్ఛందంగా పనిచేశారు. మహిళల సాధికారికత, విద్యను ప్రోత్సహించడం, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంపై దృష్టి సారించారు. మిస్​వరల్డ్ అంతర్జాతీయ పోటీల్లో ఆమె ఆత్మవిశ్వాసంతో పాలుపంచుకుంటున్నారు.

అనుది గుణశేఖర.. శ్రీలంక

మిస్​వరల్డ్ అంతర్జాతీయ పోటీల్లో శ్రీలంక దేశం నుంచి పాల్గొంటున్న అనుడి గుణశేఖర ఒక ప్రఖ్యాత మోడల్, సామాజిక కార్యకర్త, బ్యూటీ క్వీన్. శ్రీలంకలోని అనురాధపురలో జన్మించిన అనుది గుణశేఖర 2024 మిస్ వరల్డ్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈమె విద్యా నైపుణ్యం, సామాజిక కారణాలపై నిబద్ధత మహిళల సాధికారత పట్ల మక్కువతో ముందుకెళుతున్నారు. ఆమె సహేలి అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు. శ్రీలంకలో పారిశుధ్య ఉత్పత్తులను అందించడం, స్వచ్ఛమైన నీరు పారిశుధ్య సౌకర్యాలను మెరుగుపరచడం, రుతుక్రమ సమయంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యంగా సేవ చేస్తున్నారు. జైళ్లలోని మహిళలు, గర్భిణీలు ఇతర అణగారిన వర్గాలకు శానిటరీ ఉత్పత్తులు పారిశుధ్య సౌకర్యాలను అందించి నిరుపేద మహిళలకు అండగా నిలుస్తున్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీలో శ్రీలంక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుది గుణశేఖర తన దేశం సాంస్కృతిక, గొప్పతనాన్ని సామాజిక మార్పునకు సామాజిక సేవలతో అంకితభావంగా నిలుస్తున్నారు.

వాంటింగ్​లియు.. చైనా

మిస్​వరల్డ్ అంతర్జాతీయ పోటీల్లో చైనా దేశం నుంచి పాల్గొంటున్న వాంటింగ్​లియు ఒక ప్రొఫెషనల్ మోడల్. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వైఫాంగ్ సిటీకి ఆమెది. ప్రస్తుతం జియామెన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోంది. 2022లో ఈమె 71వ మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఈమె వివిధ దాతృత్వ కార్యకలాపాలలో పాల్గొని దేశం గుర్తించదగిన సేవలను కొనసాగిస్తున్నది. లైబ్రరీ నిర్మాణానికి 3 మిలియన్ యువాన్‌లను విరాళంగా ఇచ్చింది. 16 మంది విద్యార్థులకు 80,000 యువాన్‌లను విరాళంగా అందజేసి విద్య వ్యాప్తికి అండగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీచ్‌లు, పార్కులను శుభ్రం చేయడానికి స్వచ్ఛంద సేవకులను నడిపించింది. క్రమం తప్పకుండా నర్సింగ్ హోమ్‌లను సందర్శించి సమాజ సేవకు కృషి చేస్తోంది. ప్రాథమిక పాఠశాలలకు బాస్కెట్‌బాల్‌లను విరాళంగా అందజేసి, పిల్లలు టీనేజర్లలో క్రీడలను ప్రోత్సహిస్తుంది.12 ప్రావిన్సులలోని పేద ప్రాంతాలకు 14,691 వెచ్చని ప్యాకేజీలను పంపిణీ చేసింది. ఇప్పుడామె ఈ మిస్ వరల్డ్ పోటీలో చైనా అందం, సంస్కృతి, విలువలకు సూచికగా నిలుస్తోంది.

శ్రీచ్ఛ ప్రధాన్ .. నేపాల్​

శ్రీచ్ఛ ప్రధాన్ 72వ మిస్ వరల్డ్ పోటీలో నేపాల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక సామాజిక కార్యకర్త, మోడల్. పర్యావరణ కార్యకర్త ఎకో-వెంచర్ డీగో ప్రణాళిక సృష్టికర్త. ఈమె 2023లో మిస్ నేపాల్ గా నిలిచింది. 23 ఏళ్ల బుధనిల్కాంత స్కూల్ షువతర స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. తరువాత, అమెరికాలో పర్యావరణ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత, మాంటెరీలోని మిడిల్‌బరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో చేరింది. ప్రధాన్ ఇన్‌స్టాగ్రాంలో యాక్టివ్‌గా ఉండగా.. లక్షల్లో ఫాలోవర్స్​ఉన్నారు. ఆమె యువ వ్యవస్థాపకులకు వారి కలలను నెరవేర్చడంలో సహాయం చేస్తుంది. నేపాల్ వాతావరణ మార్పు క్రియాశీలతను గుర్తించడం, బహుళ జాతుల న్యాయానికి ఆమె కృషి చేస్తున్నారు. ఈ ప్రపంచంలో మనవాళియే కాదు.. జీవరాసుల మనుగుడను పరిరక్షించేందుకు పాటుపడాలన్న సందేశంతో ముందుకు వెళుతున్నారు.

గ్రేస్​రామ్టు.. కెన్యా

మిస్ వరల్డ్ పోటీలకు కెన్యా తరుపున పాలుపంచుకుంటున్నారు. ఈమె ప్రొఫెషనల్ మోడల్, ఫ్యాషన్ డిజైనర్. ఈ రంగంలో ఐదు సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఆమె సొంతంగా రామ్టు ఫ్యాషన్ డిజైన్స్ అనే కంపెనీని నడుపుతోంది. ఫ్యాషన్, డిజైన్‌లో డిప్లొమా పూర్తి చేసింది. ఈమె వృత్తిపరంగా జీవితాన్ని కొనసాగిస్తునే గ్రేస్ యువ నిపుణులకు మార్గదర్శకత్వం చేసేందుకు మక్కువ చూపుతోంది. లైంగిక వేధింపులకు గురైన యువతులకు బాసటగా నిలిచి దాతృత్వాన్ని చాటుతున్నది. ఖాళీ సమయంలో డిజైనింగ్, పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేస్తుంటుంది. గ్రేస్ 2024న నైరోబిలోని టూ రివర్స్ మాల్‌లో మిస్ వరల్డ్ కెన్యా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. కెన్యా అందం, సంస్కృతి, విలువలను ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తూ అందగత్తెలతో పోటీ పడుతోంది.

మోజిసోలా రైమి .. నైజిరియా

ఓయ్ మోజిసోలా రైమి నైజిరియా దేశం తరుపున పోటీల్లో పాలుపంచుకుంటున్నది. 24 ఏళ్ల నైజీరియన్ మోడల్. పోర్ట్ హార్కోర్ట్ వర్సిటీ గ్రాడ్యుయేట్, మిస్ వరల్డ్ నైజీరియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. జాయ్ పాల్గొనడం గమనార్హం, ఎందుకంటే నైజీరియాకు చెందిన అగ్బానీ డారెగో 2001లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్ మహిళ. "ది లవ్ ఫర్ హ్యుమానిటీ" ప్రాజెక్ట్‌కు రైమి నాయకత్వం వహిస్తున్నది. సంరక్షణ, దయ, రోజువారీ జీవితంలో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై ఈమె దృష్టి సారించింది. తన తల్లిని కోల్పోవడం, కష్టాలను ఎదుర్కోవడం వంటి వ్యక్తిగత విషాదాలను అధిగమించింది. ఇప్పుడు యువతుల సాధికారత, విద్య కోసం కృషి చేస్తోంది. నైజీరియా విభిన్న సంస్కృతులను తెలియజేసే దుస్తులను ధరించారు. నైజీరియన్ సంస్కృతి తెలిపే అద్భుతమైన అసో-ఓక్ దుస్తులలో హైదరాబాద్ హెరిటేజ్ వాక్‌లో రైమి అదరగొట్టారు. నైజీరియన్లు అంటనే చిన్నచూపు చూపే వారికి ప్రపంచ సుందరీ కీరిటం గెలుచుకోని నైజీరియాకు గర్వకారణం నిలువాలని లక్ష్యంగా మోజిసోలా రైమి పెట్టుకున్నారు.

సుచతా చువాంగ్‌శ్రీ.. థాయిలాండ్​

థాయిలాండ్ దేశం నుంచి సుచతా చువాంగ్‌శ్రీ మిస్​వరల్డ్​పోటీల్లో పాల్గొంటున్నారు. థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించిన చువాంగ్​శ్రీ థాయ్ మోడల్. అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ప్రస్తుతం థమ్మసాట్ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలలో బ్యాచిలర్ డిగ్రీని చదువుతోంది. విద్యా నైపుణ్యంపై తన నిబద్దతను ప్రదర్శిస్తున్నది. 16 ఏళ్ల వయస్సులో 10 సెం.మీ. రొమ్ము కాన్సర్ వల్ల దెబ్బతిన్నది. దీంతోనే ఆమె ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యానికి ప్రధాన ముప్పుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తోంది. సోషల్​మీడియా వేదికగా తన జీవిత పాఠాలను ప్రజలకు తెలియజేస్తోంది. ఈ వేదిక ద్వారా, విద్య, అవగాహన ప్రచారాలు లేదా ఆమె పోటీ ప్రయత్నాల ద్వారా ప్రేరణ సానుకూల ప్రభావాన్ని చూపడమే సుచతా లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ పోటీలలో థాయిలాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుచత మిస్ యూనివర్స్ థాయిలాండ్ 2024, మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025తో సహా అనేక టైటిళ్లను గెలుచుకుంది.

చియారా ఎస్పోసిటో.. ఇటలీ

72వ మిస్ వరల్డ్ పోటీలో చియారా ఎస్పోసిటో ఇటలీ దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాసెర్టా ప్రావిన్స్‌లోని కర్టిలో జన్మించారు, ఆమె తండ్రి కాంపానియాకు చెందినవారు. తల్లి మాన్‌ఫ్రెడోనియాకు చెందినవారు. మిలన్‌లోని టీట్రో అల్లా స్కాలా అకాడమీ నుంచి డిప్లొమా, క్లాసికల్ బ్యాలెట్ డ్యాన్సింగ్‌లో ప్రత్యేకతను చాటుకున్నారు. క్లాసికల్ బ్యాలెట్ డాన్సర్‌గా చియారా మాస్కోలోని బోల్షోయ్ వంటి ప్రతిష్టాత్మక వేదికలలో నృత్యం చేసింది. రెబెక్కా ఆర్నోన్ తర్వాత మిస్ వరల్డ్ ఇటలీ 2023 కిరీటాన్ని గెలుచుకుంది. చియారా ఎస్పోసిటో వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్..ఎ జర్నీ ఆఫ్ హోప్ అండ్ ఇంక్లూజన్" వేదిక ద్వారా సామాజిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వికలాంగుల పిల్లల కోసం పనిచేస్తున్నారు. ఇందు కోసంఆమె నర్సింగ్ హోమ్‌లు పీడియాట్రిక్ ఆసుపత్రులను సందర్శిస్తుంది. అనారోగ్యం బారినపడిన పిల్లలకు చికిత్స​అందించేందుకు సామాజికంగా కృషి చేస్తున్నారు. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ దోహదపడాలని సందేశాన్ని ఇస్తున్నారు.

Next Story